కరోనా డెత్ రిపోర్ట్స్‌ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య నానాటికీ పెరిగిపోతోన్నసంగతి తెలిసిందే. తెలంగాణలో టెస్టుల సంఖ్య భారీగా పెంచాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నా…ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కరోనా టెస్టులు, గణాంకాల, నివేదికల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు కూడా గతంలో హెచ్చరికలు జారీ చేసింది. అ

యినప్పటికీ, తమ ఆదేశాలను అమలు చేయడం లేదని, కోర్టులంటే తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం లేదని హైకోర్టు గతంలో పలుమార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కేసుల విషయంలో వివరణ ఇచ్చేందుకు తెలంగాణ సీఎస్‌ సోమేష్ కుమార్ హైకోర్టుకు కూడా హాజరయ్యారు.

ఈ నేపథ్యంలోనే మరోసారి తెలంగాణ సర్కార్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యను మార్చి నెల నుంచి ఇప్పటివరకు తక్కువ చేసి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణలో ప్రతి రోజు 8 నుంచి 10 మంది మాత్రమే కరోనా బారిన పడి చనిపోతున్నారా అంటూ కరోనా డెత్ రిపోర్ట్స్‌ పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కోవిడ్ కేసులు, కరోనా విపత్తు నిర్వహణపై శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా తెలంగాణ సర్కార్ పై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రైవేట్‌ హాస్పటళ్లలో అధిక చార్జీలపై ఈ నెల 22న నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటివరకు ఎన్ని ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చారో నివేదిక సమర్పించాలని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించింది.

50 శాతం బెడ్స్‌ పై ఢిల్లీ మాదిరిగా వ్యవహరించాలని, తెలంగాణలో బెడ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారో నివేదిక ఇవ్వాలని, డిజాస్టార్ మేనేజ్మెంట్ ప్లాన్స్ , సంబంధిత చర్యలు తెలపాలని కోర్టు ఆదేశించింది.

పబ్లిక్ హెల్త్‌పై మార్చి 24 కు ముందు ఎంత ఖర్చు చేశారు…మార్చి తర్వాత ఎంత ఖర్చు చేశారో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కరోనాకు సంబంధించిన కచ్చితమైన రిపోర్టులు సమర్పించాలని, తప్పుడు నివేదికలు ఇస్తే మళ్లీ సీఎస్‌ని కోర్టుకు పిలవాల్సి వస్తుందని తెలంగాణ సర్కార్ ను హైకోర్టు హెచ్చరించింది.

ఈ నెల 22నాటికి రిపోర్టులన్ని సమర్పించాలని సూచించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో సిబ్బంది, మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఆ పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 24 కి వాయిదా వేసింది.