కాంగ్రెస్ గాలమేస్తోందా?

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కదలికలు మొదలయ్యాయి. ఒకవైపు వైసీపీ, టీడీపీ-జనసేన అధినేతలు పొత్తు చర్చల్లో జోరుపెంచారు. పోటీచేయాల్సిన సీట్లు, నియోజకవర్గాలు, ఉమ్మడి మ్యానిఫెస్టో తదితరాలపై చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి దాదాపు మూడున్నర గంటలు చర్చించారు. ఇక బీజేపీ కూడా అభ్యర్ధుల ఎంపికపై జిల్లాల వారీగా కమిటీలను వేసి ఆశావహులతో మీటింగులు పెట్టుకుంటోంది.

వామపక్షాలు తదితర పార్టీలను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే వాటి ఉనికి కూడా నామమాత్రం కాబట్టే. నిజానికి కాంగ్రెస్ ఉనికి కూడా నామమాత్రమనే చెప్పాలి. కాకపోతే రెండు కారణాలతో కాంగ్రెస్ కు సడెన్ గా ఊపు మొదలైంది. అదేమిటంటే మొదటిది వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం. ఇక రెండో కారణం ఏమిటంటే వైసీపీ, టీడీపీల్లో జరుగుతున్న పరిణామాలు. టికెట్ల కేటాయంపులో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి మూడు జాబితాలు ప్రకటించారు. ఈ మూడు జాబితాల్లో కలిపి 51 మంది ఎంఎల్ఏలను ప్రకటించారు.

ఇందులోనే 24 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలకు టికెట్లు నిరాకరించారు. వీరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి లాంటి కొందరు ఎంఎల్ఏ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామాలు చేశారు. కొలుసు పార్ధసారధి  లాంటి మరికొందరు టీడీపీలో చేరిపోయినట్లే. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని వంశీ జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం మొదలైంది. టికెట్ల కేటాయింపుపై టీడీపీ, జనసేన అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు. చంద్రబాబు, పవన్ గనుక టికెట్లను ప్రకటిస్తే ఈ పార్టీల్లో కూడా అసంతృప్తులు బయటపడటం ఖాయం.

వైసీపీ, టీడీపీలోని అసంతృప్తులపై కాంగ్రెస్ గాలమేస్తోందట. పై రెండు పార్టీల నుండి ఎంతమంది వచ్చినా టికెట్లు ఇవ్వటానికి కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అసలాపార్టీలో గట్టి నేతలే లేరు కాబట్టి. అందుకనే పై రెండుపార్టీల్లోని పరిణామాలను కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. కొడుకు పెళ్ళి పనుల్లో షర్మిల బిజీగా ఉన్నారు. ఆ కార్యక్రమం అయిపోతే పార్టీలో షర్మిల యాక్టివ్ అవుతారు. అప్పటికి టికెట్ల విషయంలో పై రెండుపార్టీలు పూర్తి క్లారిటితో ఉంటాయి. కాబట్టి అసంతృప్తుల చేరికలు జోరుగా జరిగే అవకాశాలున్నాయి.