కనుమ నాడు చంద్రబాబు కేసులో తుది తీర్పు

స్కిల్ డెవలప్మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 50 రోజులపాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. అయితే, చంద్రబాబు అరెస్టు సమయంలో సెక్షన్ 17 ఏ ఆయనకు వర్తిస్తుందా లేదా అన్నదానిపై ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా వాడివేడి వాదనలు జరిగాయి.

ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబరు 20న ఇరుపక్షాల తుది వాదనలు విన్న సుప్రీం కోర్టు సెక్షన్ 17ఏ, క్వాష్ పిటిషన్ పై తుది తీర్పును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జనవరి 16వ తేదీన ఈ వ్యవహారం పై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండానే తన అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. 17 ఏ సెక్షన్ తనకు వర్తిస్తుందని, దానిని పాటించకుండానే అరెస్టు చేయడం సరికాదని ఆయన పిటిషన్ వేశారు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే, చంద్రబాబుకు 17 ఏ సెక్షన్ వర్తించదని ఏపీ సిఐడి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 20న వాదనలు పూర్తయి తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16న జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో తుది తీర్పు వెలువరించనుంది. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ కేసులో ఎటువంటి తీర్పు రాబోతుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.