కొత్త కొత్త‌గా ష‌ర్మిల‌.. టీడీపీ ఫిదా..ఏం జ‌రిగింది?

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఆ పార్టీ కండువా క‌ప్పుకొన్న వైఎస్ ష‌ర్మిల తాజాగా మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యారు. త‌న కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించి.. ఆహ్వానించేందుకు హైద‌రాబాద్‌లోని చంద్ర‌బాబు నివాసానికి ఆమె వెళ్లారు. ఆహ్వాన ప‌త్రిక‌, కానుక అందించారు. పెళ్లికి రావాల‌ని ఆహ్వానించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ష‌ర్మిల కొత్త‌కొత్త‌గా ఉండ‌డ‌మే చ‌ర్చ‌గా మారింది.

చంద్ర‌బాబుకు స‌హ‌జంగా ప‌సుపు వ‌ర్ణం అంటే చాలా ఇష్ట‌ప‌డతారు. ఆయ‌న పార్టీ గుర్తు కూడా ప‌సుపే. ఆయ‌న ధ‌రించే చొక్కా కూడా లైట్ ప‌సుపు రంగులోనే ఉంటుంది. ఇలా అని కాదుకానీ.. ఎందుకో.. ష‌ర్మిల‌.. కూడా.. అన్నీ ప‌సుపు వ‌ర్ణంలో ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు క‌నిపించింది. ప‌సుపు రంగు చీర‌ను ధ‌రించారు. ప‌సుపు రంగులో ఉన్న చెప్పులు వేసుకున్నారు. అదేవిదంగా చంద్ర‌బాబు ఇచ్చిన పుష్ప‌గుచ్ఛంలోనూ ఎక్కువ‌గా ప‌సుపు వ‌ర్ణంలో ఉన్న పూల‌ను తీసుకువ‌చ్చారు. ఎక్కువ‌గా ప‌సుపు వ‌ర్ణంలోనే ఆమె క‌నిపించారు.

ఈ మార్పు విష‌యం గ్ర‌హించిన టీడీపీ నాయ‌కులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. యాదృచ్ఛిక‌మో.. లేక మ‌రే కార‌ణ‌మో తెలియ‌దు కానీ.. వైఎస్ ష‌ర్మిల ప‌సుపు వ‌ర్ణంలో మెరిసిపోవ‌డం.. ప‌సుపు వ‌ర్ణంలో ఉన్న‌పుష్ప గుచ్ఛాన్ని అందించ‌డం.. చ‌ర్చ‌గా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబును వ్య‌క్తిగ‌త అంశంపైనే క‌లిసినా.. ఇలా.. ఆయ‌న‌కు ఇష్ట‌మైన‌.. ప‌సుపు వ‌ర్ణం దుస్తులు ధ‌రించ‌డం.. ప‌సుపు వ‌ర్ణంలో ఉన్న చెప్పులు ధ‌రించ‌డం ఆస‌క్తిగా మారింది.