టికెట్ ఎఫెక్ట్‌: ఎక్క‌డిక‌క్క‌డ అడ్ర‌స్ లేని నేత‌లు!

వైసీపీ ప్రజాప్ర‌తినిధులు గ‌త నెల రోజులుగా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 151మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండ‌గా.. సీఎం జ‌గ‌న్ మిన‌హా.. గ‌త నెల రోజులుగా మిగిలిన వారు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మంత్రుల్లోనూ ఒక్క పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. వారు కూడా కొన్ని అంశాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మిగిలిన వారు ఎక్క‌డా ఐపు లేకుండా పోయారు.

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు అయితే.. అస‌లు గేటుకు తాళాలు వేసుకున్నారా? అనే ప‌రిస్థితి నెల‌కొం ది. వారిని క‌లిసేందుకు వ‌చ్చేవారికి లేర‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. నాయ‌కులు ఊళ్లోనే ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రినీ క‌లుసుకోవ‌డం లేదు. దీనికి కారణం.. టికెట్ ఎఫెక్ట్‌. ఇప్పుడు వైసీపీలో ఏ నేత‌ను క‌దిపినా.. టికెట్ ఫీవ‌ర్‌తో అల్లాడిపోతున్నారు. త‌మ‌కు టికెట్ వ‌స్తుందో రాదో అనే బెంగ‌తో కొంద‌రు ఇంటికే ప‌రిమితం అయ్యారు.

మ‌రికొంద‌రు నాయ‌కులు అధిష్టానాన్ని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు విజ‌య‌వాడ‌, గుంటూరుల్లోనే రోజుల త‌ర‌బ‌డి తిష్ట‌వేశారు. క‌ర్నూలు కు చెందిన కీల‌క మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం.. ఏకంగా వారం రోజుల నుంచి విజ‌య‌వాడ‌లోని ప్ర‌ముఖ హోట‌ల్‌లోనే ఉన్నారు. ఆయ‌న‌కు ఇప్పటికీ టికెట్ విష‌యం తేల‌లేదు. దీంతో ఏం జ‌రుగుతుందో.. ఏక్ష‌ణాన పిలుపు అందుతుందో అని ఎదురు చూస్తున్నారు. హిందూపురం ఎంపీ నుంచి క‌ర్నూలు నాయ‌కుల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి.

దీంతో ఎన్నిక‌ల‌కు మూడుమాసాల స‌మ‌యం ఉండ‌గానే పాల‌న దాదాపు ఆగిపోయిన‌ట్టే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. స‌హ‌జంగా ఎన్నిక‌ల‌కు ముందు ముఖ్యమంత్రి నిధి నుంచి సాయం పొందేందుకు చాలా మంది మంత్రుల‌ను ఆశ్ర‌యిస్తారు. కానీ, ఇప్పుడు వారెవ‌రూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకుండాపోయారు. ఇక‌, టికెట్ ద‌క్క‌ని వారు ప్ర‌జాక్షేత్రంలో క‌నిపించ‌డ‌మే మానేశారు. మ‌రోవైపు.. కొంద‌రు పొరుగు పార్టీల్లో చేరేందుకు కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏదేమైనా .. ఎన్నిక‌ల‌కు మూడు మాసాల ముందుగానే.. ప్ర‌జాప్ర‌తినిధులు ఇలా సుప్త‌చేత‌నావ‌స్థ‌కు చేరుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.