ఈ నెల 18న టీడీపీలోకి పార్ధ సారధి?

వైసీపీలో టికెట్ దక్కని, సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన నేతలు పార్టీని వీడుతున్న వైనం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. వైసీపీకి సీనియర్ రాజకీయవేత్త, ఎమ్మెల్యే పార్థసారథి రాంరాం అనబోతున్నారని టాక్ వస్తోంది. అంతేకాదు, హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యేందుకు పార్థ సారధి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. నూజివీడు లేదా పెనమలూరులో ఒక టికెట్ ఇచ్చేందుకు టీడీపీ సూత్ర ప్రాయంగా అంగీకారం కూడా తెలిపిందని తెలుస్తోంది.

విజయవాడలోని తన ఆఫీసులో టీడీపీ నేతలతో కూడా పార్థ సారధి భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ నెల 18న గుడివాడలో ‘రా.. కదలి రా’ సభా వేదికపై చంద్రబాబు సమక్షంలో పార్థసారథి సైకిల్ ఎక్కబోతున్నారట. మంత్రి పదవి దక్కకపోవడంతో చాలాకాలంగా వైసీపీపై పార్థ సారధి అసంతృప్తిగా ఉంటూ బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన వైసీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పెనమలూరు టికెట్ పై క్లారిటీ రాకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారట. కానీ, ఆ ప్రచారాన్ని పార్థసారధి ఖండిస్తున్నారు.

మరోవైపు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వైసీపీకి టాటా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. దొరబాబుకు టికెట్ లేదని జగన్ తేల్చేయడం, ఆయన స్థానంలో పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా కాకినాడ ఎంపీ గీతను నియమించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో, ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా తన అనుచరులు, అభిమానులతో బల ప్రదర్శన చేయబోతున్నారు దొరబాబు. పిఠాపురంలోని నాలుగు మండలాలకు చెందిన తన అనుచరులకు ఆత్మీయ విందు ఇచ్చి పార్టీ మార్పుపై కూడా చర్చిస్తారట.