బెజ‌వాడ నుంచి సై..: సుజ‌నా

వ‌చ్చే అసెంబ్లీ లేదా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తాను బెజ‌వాడ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌ముఖ పారివ్రామిక వేత్త‌, బీజేపీ నాయ‌కుడు సుజ‌నా చౌద‌రి(స‌త్య‌నారాయ‌ణ‌) వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం తాను బీజేపీలోనే ఉన్నాన‌న్నారు. పార్టీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న‌ట్టు చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను విజ‌య‌వాడలో ఏ స్తానం నుంచి అయినా.. పోటీకి రెడీగా ఉన్న‌ట్టు బీజేపీ అధిష్టానానికి సైతం చెప్పిన‌ట్టు తెలిపారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న‌ట్టు సుజ‌నా చౌద‌రి తెలిపారు. అయితే.. బీజేపీ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుంటుంద‌నేది త‌న‌కు తెలియ‌ద‌ని.. ఆ విష‌యాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుంద‌ని వ్యాఖ్యానించారు. దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అన్ని రాస్ట్రాల‌పైనా బీజేపీ ఫోక‌స్ పెంచింద‌ని, త్వ‌ర‌లోనే ఏపీ రాజ‌కీయాల‌పైనా దృష్టి పెడుతుంద‌ని సుజ‌నా వ్యాఖ్యానించారు.

అప్పుడు పొత్తుల విష‌యాన్ని ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంద‌ని సుజనా చెప్పారు. విజయవాడ నుంచి పోటీ చేస్తే. తాను గెలిచి కానుక‌గా ఇస్తాన‌ని చౌద‌రి వ్యాఖ్యానించారు. దాదాపు పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌పైనే త‌న దృష్టి ఉంటుంద‌ని సుజ‌నా చెప్పుకొచ్చారు.

అమ‌రావ‌తికే జై!

వ్య‌క్తిగ‌తంగా తాను ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తినే కోరుకుంటున్న‌ట్టు సుజ‌నా చౌద‌రి చెప్పారు. రాజ‌కీయంగా చూసుకున్నా.. బీజేపీ కూడా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిద‌ని.. రెండో ద‌శ రైతుల ఉద్య‌మానికి బీజేపీ నాయ‌కులు మ‌ద్ద‌తు తెలిపి.. ఉద్య‌మంలో పాలు పంచుకున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏపీలో ప్ర‌తి ఒక్క‌రూ రాజ‌ధాని అమ‌రావ‌తినే కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.

ఎన్నిక‌ల విష‌యంపై మాట్లాడుతూ.. ఏపీలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాతంగా నిర్వ‌హించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయని, ఇటీవ‌ల విజ‌య‌వాడ వ‌చ్చిన సీఈసీకి బీజేపీ నేత‌లు ఇచ్చిన‌ ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటుంద‌నే ఆశిస్తున్న‌ట్టు సుజ‌నా వ్యాఖ్యానించారు.