కేటీఆర్, హరీష్ లకు… పెద్దపల్లిలో అడ్డం తిరిగారా ?

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ సమావేశాల్లోనే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నేతలతో కేటీయార్, హరీష్ రావు తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని నేతల్లో చాలామంది అగ్రనేతలకు అడ్డంతిరిగినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లిలో పార్టీ గెలుపు కష్టమని స్పష్టంగా చెప్పారట. ఎందుకంటే పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచారు. గెలవటం కూడా పెద్ద మెజారిటీలతోనే గెలిచినట్లు చెప్పారట.

చెన్నూరు అసెంబ్లీలో 37,189, బెల్లంపల్లిలో 36,878, మంచిర్యాలలో 66, 116, ధర్మపురిలో 22, 039, రామగుండంలో 56,794, మంథనిలో 1,380 పెద్దపల్లిలో 55,108 ఓట్ల మెజారిటితో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచిన విషయాన్ని కారుపార్టీ నేతలు గుర్తుచేశారట. కాంగ్రెస్ సాధించిన మెజారిటీలను గమనిస్తే ఇదే ట్రెండ్ కాస్త అటు ఇటుగా పార్లమెంటు ఎన్నికల్లో కూడా రిపీటయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు స్ధానిక నేతలు చెప్పారట. మంత్రులు, ఎంఎల్ఏలపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని చాలాకాలంగా తామెంత మొత్తుకున్నా ఎవరు పట్టించుకోని విషయాన్ని ఇపుడు నేతలు గుర్తుచేశారు.

ఎంఎల్ఏ అభ్యర్థులను మార్చకపోవటంతోనే ఇంత భారీ నష్టం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారట. అగ్రనేతల్లో తప్పులు పెట్టుకుని రేపటి పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ ఎలా గెలుస్తుందని నిలదీశారట. దాంతో వీళ్ళకి ఏమి సమాధానం చెప్పారో కేటీయార్, హరీష్ కు అర్ధం కాలేదట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి పాలనపై జనాల్లో సానుకూల స్పందన కనబడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారని సమాచారం.

కేసీయార్ పాలనలో పథకాల అమలులో అవినీతి, అనర్హులకు పథకాలను వర్తింపచేయటం, మంత్రులు, ఎంఎల్ఏలను కంట్రోల్లో పెట్టుకోమని చెబితే వినకపోవటం లాంటి అనేక కారణాలతో పార్టీమీద జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని గుర్తుచేశారట. ఇప్పటికిప్పుడు తాము ఏమీచేయలేమని పార్లమెంటుకు పోటీచేయబోయే అభ్యర్ధిని అయినా నేతల అభిప్రాయాల ప్రకారం మంచివాళ్ళని ఎంపికచేయమని సూచించినట్లు పార్టీ వర్గాల టాక్. ఎవరిని నిలబెట్టినా బీఆర్ఎస్ గెలుపు కష్టమే అన్న అభిప్రాయాన్ని మెజారిటీ నేతలు వ్యక్తంచేశారట. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.