వైఎస్ మ‌ర‌ణం వెనుక కాంగ్రెస్‌.. ష‌ర్మిల వెనుక చంద్ర‌బాబు: స‌జ్జ‌ల

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంద‌ని, దీనిపై త‌మ‌కు అప్ప‌టి నుంచే అనుమానాలు ఉన్నాయ‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ స‌ర్కారు స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై గ‌తంలో తాము విచార‌ణ‌కు కూడా డిమాండ్ చేశామ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. త‌మ ఆవేద‌న అర‌ణ్య రోద‌న‌గానే మిగిలిపోయింద‌న్నారు. ఇక‌, తాజాగా వైఎస్ కుమార్తె ష‌ర్మిల త‌న పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డం.. ఆ పార్టీతో చేతులు క‌ల‌ప‌డం పైనా స‌జ్జ‌ల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేర‌డం, త‌న పార్టీని విలీనం చేయ‌డం వెనుక టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉన్నార‌ని.. ఆయ‌న కుట్ర‌లో భాగంగానే ఆమె కాంగ్రెస్‌తో చేతులు క‌లిపార‌ని స‌జ్జ‌ల విమ‌ర్శ‌లు గుప్పించారు. వైఎస్ కుటుంబాన్ని రాచి రంపాన పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. సీఎం జ‌గ‌న్‌పై అనేక కేసులు పెట్టించి.. జైల్లోకి కూడా నెట్టిన పార్టీ కాంగ్రెస్‌యేన‌ని ఆయ‌న చెప్పారు. కాంగ్రెస్ తో కేసులు పెట్టించ‌డం వెనుక చంద్ర‌బాబు హ‌స్తం కూడా ఉంద‌న్నారు. ఇప్పుడు ఏపీలో సీఎం జ‌గ‌న్‌ను, వైసీపీని దెబ్బ తీసేందుకు.. వ్యూహాత్మ‌కంగా ష‌ర్మిల‌ను కాంగ్రెస్‌తో క‌లిపార‌ని అన్నారు.

త‌న వ్యూహాల‌ను అమ‌లు చేసేందుకు చంద్ర‌బాబు ఇత‌రుల‌ను వాడుకుంటార‌ని స‌జ్జ‌ల ఆరోపించారు. ఇప్పుడు ష‌ర్మిల వ్య‌వ‌హారం కూడా దీనిలో భాగ‌మేన‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంక్షేమం పేరుతో చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో పోటీ ప‌డాల‌ని సూచించారు. ఇదే జ‌రిగితే.. ఆయ‌న ఓట‌మి ఖాయ‌మ‌ని చెప్పారు. షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని.. అలాంటి పార్టీని తాము పట్టించుకోమని తెలిపారు.

ఎస్మా కాక ఏం చేస్తాం!

రాష్ట్రంలో గ‌త 22 రోజులుగా ఉద్య‌మిస్తున్న అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం సమంజసమేనని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు. ఎస్మా ప్ర‌యోగించ‌క తాము ఏం చేస్తామ‌న్నారు. అంగన్వాడీల సమ్మెతో చిన్నపిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారని.. వాళ్ల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పారు. అత్యవసర సర్వీసుల కింద అంగన్వాడీలు ఉన్నారని.. వారు తిరిగి వీధుల్లో చేరాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. అయినా వారు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారని.. అందుకే ఎస్మా చట్టాన్ని ప్రయోగించామన్నారు. దీనిని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.