అంగన్వాడీలకు జగన్ షాక్

CM Jagan

జీతాల పెంపుతో పాటు గ్రాట్యుటీ పెంపు కోసం ఏపీలో అంగన్వాడీలు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అంగన్వాడీల సమ్మెను పట్టించుకోని జగన్ ప్రభుత్వం వారిని చర్చలకు కూడా ఆహ్వానించలేదు. అంతేకాకుండా, ఈ నెల 5వ తేదీ లోపు విధుల్లో చేరకుంటే ఎస్మా ప్రయోగిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం అల్టిమేటం జారీ చేసింది. అయినా సరే వెనక్కి తగ్గబోయేది లేదని అంగన్వాడీలు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. అంగన్వాడీలపై ఉక్కు పాదం మోపిన జగన్ సర్కార్ వారిపై ఎస్మా ప్రయోగించింది.

అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులోకి చేర్చిన జగన్ సర్కార్…రాబోయే 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం శనివారం నాడు జీవో నెంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాకుండా, గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతాలలోనూ కోత విధించింది. సమ్మె కాలానికి జీతాన్ని కట్ చేస్తూ మిగిలిన జీతాన్ని వారి ఖాతాలలో జమ చేసింది.

ప్రజల సాధారణ జీవితం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా సమ్మె చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తుంటారుర. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం వైద్యం, ప్రసార సాధనాలు వంటి అత్యవసర సేవలకు ఈ చట్టాన్ని ప్రయోగిస్తుంటారు. కానీ, ఏపీలో మొదటిసారి అటువంటి అత్యవసర సర్వీస్ కాని అంగన్వాడి సేవలపై ఎస్మా ప్రయోగించడం హాట్ టాపిక్ గా మారింది. మరి, సమ్మెను విరమించి అంగన్వాడీలు విధుల్లో చేరుతారా లేకపోతే సమ్మెను కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.