సజ్జలతో నాకు గొడవేంటి?: ఎంపీ గోరంట్ల

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గొడవ పడ్డారట…ఈ వార్త మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. సిట్టింగ్ స్థానం మార్చడంపై గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారని, సజ్జలకు గోరంట్లకు వాగ్వాదం జరిగిందని పుకార్లు వచ్చాయి. దీంతో, ఆ విషయంపై గోరంట్ల మాధవ్ స్పందించారు. తాను సజ్జలతో మాట్లాడిన మాట వాస్తవమేనని, కానీ, ఆయనకు తనకు గొడవ జరగలేదని గోరంట్ల అన్నారు. వైసీపీ తనకు రాజకీయ భిక్ష పెట్టిందని, కన్నతల్లి లాంటిదని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహించడం తన బాధ్యత అని అన్నారు. టికెట్ వచ్చినా, రాకున్నా వైసీపీలోనే ఉంటానని అన్నారు.

తాను ఇదే ఫీల్ అవుతున్నానని, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. సామాజిక సమీకరణాల వల్లనో, వ్యక్తిగత ప్రదర్శన, సర్వేల కారణంగా సీటు కొందరికి రాకపోవచ్చని చెప్పారు. సీటు రాకున్నా పార్టీకి సైనికులలాగా కష్టపడే మనస్తత్వం కలిగిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ దగ్గర ఉన్నారని, కచ్చితంగా పార్టీ ఆదేశాలను శిరోధార్యంగా భావిస్తామని చెప్పారు.

సజ్జల తనను కలిసినా, మిగతా నేతలను కలిసినా ప్రేమగా మాట్లాడుతారని, ఉన్న విషయాన్ని తెలియజేస్తారని అన్నారు. తాము చెప్పిన అంశాలను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన తెలియజేస్తారని గోరంట్ల చెప్పుకొచ్చారు. అందరిని ప్రేమగా చూసుకునే ఆయనతో తాను గొడవ పడినట్లు, జగన్ తో పెద్దిరెడ్డి వాగ్వాదం చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయని మండిపడ్డారు. ఆయా సంస్థలు కడుపుకి అన్నం తిని విషం కక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సమీకరణలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని, కులాలకు అన్ని ప్రాంతాలకు అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తోందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నాయకత్వాన్ని బలపరచాలన్నది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అని, అందులో భాగంగానే తాత్కాలికంగా కొందరిని పక్కన పెట్టవచ్చని చెప్పారు.

పక్కన పెడితే పార్టీ కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటారని, కచ్చితంగా ఎవ్వరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి పార్టీ సరైన ప్రాతినిధ్యాన్ని, సరైన హోదాను, సరైన గౌరవాన్ని కల్పించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. సీఎం గారిని త్వరలోనే కలుస్తానని, చావైనా రేవైనా వైసీపీలోనే అని, ఇతర పార్టీలవైపు చూసే ప్రసక్తే లేదని అన్నారు.