జగన్ ‘చిచ్చు’ కామెంట్ల పై షర్మిల రియాక్షన్

కాకినాడలో జరిగిన వైఎస్సార్ పెన్షన్ కానుక బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల కోసం కొన్ని పార్టీలు పొత్తులతో జిత్తులు వేస్తుంటాయని, ఆఖరికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేందుకు, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. వైఎస్ షర్మిలను ఉద్దేశించి జగన్ ఆ కామెంట్లు చేశారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిలకు ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది.

కుటుంబంలో చిచ్చు గురించి జగన్ ఏం మాట్లాడారో తనకు తెలియదని షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, పార్టీ హైకమాండ్ తనకు ఏ బాధ్యతలు అప్పగించలేదని అన్నారు. ఆంధ్రా అయినా…అండమాన్ అయినా హై కమాండ్ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించి పార్టీ గెలుపు కోసం పని చేస్తానని అన్నారు. తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్నదానిపై 2 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.

కాంగ్రెస్ కోసం వైఎస్సార్ తన జీవితకాలం కష్టపడ్డారని, దేశంలోనే అతిపెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. మణిపూర్ అల్లర్లు, ప్రాణనష్టం తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన అవసరముందని, కేవలం కాంగ్రెస్ పార్టీకే అది సాధ్యమని అన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారని, అందుకే కాంగ్రెస్ లో చేరడంతోపాటు తన పార్టీ వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశానని అన్నారు.

కాంగ్రెస్ ను గెలిపించాలనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్సార్ టీపీ దూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన తండ్రి వైఎస్సార్ కల అని, ఆ కలను నెరవేర్చడానికి తాను శాయశక్తులా కృషి చేస్తానని షర్మిల వివరించారు.