ఉద్యోగులు హ్యాపీయేనా ?

తెలంగాణాలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు హ్యాపీగా ఉన్నట్లున్నారు. ఎందుకంటే కొత్త సంవత్సరంలో 2వ తేదీన చాలామందికి జీతాలు పడ్డాయి. కొన్ని శాఖల్లోని కొంతమంది ఉద్యోగులకు మాత్రం పడలేదంతే. వీళ్ళకు కూడా వీలైనంత తొందరలోనే అంటే ఒకటి రెండు రోజుల్లోనే జీతాలు పడేట్లుగా ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ప్రతినెలా మొదటి రెండురోజుల్లోనే జీతాలు పడక చాలా కాలమైంది. కేసీయార్ అధికారంలో ఉన్నపుడు ఏ రోజు జీతాలు పడతాయో కూడా ఎవరు చెప్పలేకపోయేవారు.

కొన్ని శాఖల్లోని ఉద్యోగులకు రెండో వారం, మరికొందరికి మూడోవారంలో జీతాలు పడేవి. జీతాలు వేయటానికి కేసీయార్ ప్రభుత్వం ఆల్పాబెట్ పద్దతిని అనుసరించేది. ఏ తో మొదలయ్యే విభాగాల ఉద్యోగులకు మొదటగా జీతాలు అందేది. అదికూడా నెల మొదటి రెండురోజుల్లో మాత్రం కాదు. తమిష్టం వచ్చినట్లు జీతాల తేదీలను మార్చేసేది. ఈ విషయంలో ఉద్యోగసంఘాలు ఎంతమొత్తుకున్నా కేసీయార్ పట్టించుకోలేదు. దేశంలోనే ధనిక రాష్ట్రమని చెప్పుకోవటమే కానీ ఆచరణలో మాత్రం ఏ విషయంలోనూ లేదు.

ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు నెల మొదట్లోనే జీతాలు వేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఈ విషయమై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే జనవరి 2వ తేదీన చాలామంది ఉద్యోగులకు జీతాలు ఖాతాల్లో డిపాజిట్ అయ్యింది. ప్రతినెలా 5వ తేదీలోగా జీతాలు, పెండింగ్ బిల్సన్నీ క్లియర్ చేసేట్లుగా రేవంత్ ఆర్ధికశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది ఏమిటంటే ప్రతినెలా మూడోవారంలోనే జీతాలు, పెన్షన్లు, పెండింగ్ బిల్లులను రెడీచేయాలి. మూడు కలిపి ఎంత మొత్తం అవుతుందో ముఖ్యమంత్రికి ఫైల్ పెట్టాలి. సీఎం ఆమోదం కాగానే సదరు బిల్లులను రెడీచేయాలి. అంటే ప్రతినెలా మూడోవారంలో సుమారు రు. 6 వేల కోట్లను జీతాలు, పెన్షన్లు, పెండింగ్ బిల్లుల చెల్లింపుకోసం రెడీగా పెట్టుకోవాల్సిందే. అంతా రెడీ అయిన తర్వాత నాలుగివారంలో ఆర్ధికశాఖ నుండి ట్రెజరీలకు బిల్లులు శాంక్షన్ అయి వెళ్ళిపోతాయి. ఈ మేరకు ట్రెజరీ అధికారులు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారు. కేసీయార్ వచ్చిన తర్వాత ఈ వ్యవహారమంతా అస్తవ్యస్ధమైపోయింది. దాన్ని రేవంత్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు.