సుప్రింకోర్టు చేతులు దులిపేసుకుందా ?

రాజధానుల వివాదాన్ని వాయిదా వేయటం ద్వారా సుప్రింకోర్టు చేతులు దులిపేసుకున్నట్లుంది. అత్యవసరంగా విచారించాలని ప్రభుత్వం ఎంత విజ్ఞప్తిచేసినా ధర్మాసనం పట్టించుకోలేదు. ప్రభుత్వ వాదనలు తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇచ్చేపేరుతో కేసు విచారణను ఏప్రిల్ కు కోర్టు వాయిదావేసింది. కేసు విచారణను ఏప్రిల్ కు వాయిదా అంటేనే కోర్టు మనోగతం అర్ధమైపోతోంది. విషయం ఏమిటంటే మూడురాజధానులను ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్షాలు డిమాండ్లు చేస్తున్నాయి.

ఇదే సమయంలో అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి జేఏసీ పేర్లతో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు తర్వాత సుప్రింకోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. బుధవారం మూడు రాజధానుల కేసుపై సుప్రింకోర్టులో విచారణ జరిగింది. అత్యవసరం దృష్ట్యా మూడు రాజధానుల వ్యవహారంపై వెంటనే విచారణ పూర్తిచేయాలని ప్రభుత్వం వాదించింది. అయితే ప్రభుత్వం వాదనను విన్న జడ్జీలు ప్రతివాదులకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ వాదనను కూడా వినాలన్నారు. ప్రతివాదుల వాదనను వినాలన్న కారణంతో తర్వాత విచారణను ఏప్రిల్ కు వాయిదా వేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికలు జరగబోతున్నాయని తెలిసి కూడా సుప్రింకోర్టు కేసును ఏప్రిల్ కు ఎందుకు వాయిదా వేసినట్లు ? ఎందుకంటే జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులా ? లేకపోతే చంద్రబాబు, ప్రతిపక్షాలు పట్టుబడుతున్నట్లు అమరావతే ఏకైక రాజధానా అన్న విషయం తొందరలో జరగబోయే ఎన్నికలతో ముడిపడుంది.

జగన్ మళ్ళీ గెలిస్తే మూడు రాజధానులకు అనుకూలంగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అలాకాకుండా వైసీపీ ఓడిపోతే మూడు రాజధానుల ప్రతిపాదన వీగిపోవటం ఖాయం. మూడు రాజధానులకు అనుకూలంగా కోర్టుల్లో ఉన్న కేసులన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది. దాంతో అమరావతే ఏకైక రాజధానిగా నిలుస్తుంది. అప్పుడు కోర్టు తీర్పుతో సంబంధంలేకుండా అమరావతి మాత్రమే రాజధానిగా మిగిలిపోతుంది. సో, ఈ విషయాలను గమనించిన తర్వాతనే సుప్రింకోర్టు రాజధాని వివాదాన్ని ఏప్రిల్ కు వాయిదావేసినట్లు అర్ధమవుతోంది.