సీఎం జగన్, ఆయన పాలనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇష్టారీతిన అవినీతి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ జగన్ రాజకీయాలను అపవిత్రం చేశాడని, మంచి చెడుకు తేడా తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలను జగన్ మారుస్తున్న విధానాన్ని తన జీవితంలో ఎన్నడూ వినలేదని, కనలేదని…45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ అంతటి దారుణమైన ముఖ్యమంత్రిని, పాలనను ఏనాడూ చూడలేదని చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు.
రాష్ట్రంలో దోపిడీలు ఎక్కువయ్యాయని, అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. బాధ్యతగల ప్రజలంతా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆలోచించాలని పిలుపునిచ్చారు.
12 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ వ్యవస్థలను నాశనం చేశాడని, రోడ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని దెబ్బతిన్నాయని అన్నారు. ప్రజలు అసహ్యించుకుంటున్నారని జగన్ ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. వ్యవస్థలు సక్రమంగా ఉండి, వాటిని నడిపించేందుకు సమర్థులైన వ్యక్తులు ఉంటే దాని ఫలితాలు సామాన్యులకు దక్కుతాయని అన్నారు.
జగన్ తన పార్టీతో పాటు రాష్ట్రాన్ని కూడా గందరగోళం లోకి నెట్టేశాడని ఆరోపించారు. ఏపీలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, పక్క రాష్ట్రాల వాళ్ళు ఏపీని తిట్టుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతగల నాయకులంతా ఆలోచించాలని, ఇలా చూస్తూ కూర్చుంటే చివరకు రాష్ట్రంలో ఏమీ మిగలదని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు జనవరి 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ’రా కదలి రా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్పారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తానని అన్నారు.
తెలుగుజాతి బతికున్నంత కాలం గుర్తుండే వ్యక్తి ఎన్టీఆర్ అని, 60 ఏళ్ల వయసు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ఎందరికో ఆదర్శప్రాయమన్నారు. తన ఇంటికి 100 గజాల రోడ్డు వేస్తే ప్రతిరోజు విమర్శించిన జగన్…500 కోట్లు పెట్టి రుషికొండ తవ్వి ప్యాలెస్ ఎలా కట్టుకుంటున్నాడని ప్రశ్నించారు. రాష్ట్రానికి జగన్ శాశ్వతంగా సీఎంగా ఉంటాడా అని ఎద్దేవా చేశారు. వందల కోట్లు లాయర్లకు విచ్చలవిడిగా ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని, రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. మొన్న 11 మందిని, నిన్న 27 మందిని మార్చాడని విమర్శించారు. నా బీసీలు, ఎస్సీలు, ఎస్సీలు, మైనార్టీలు అంటూ వారి స్థానాలను మాత్రమే మారుస్తున్నా ఆరోపించారు.
పుల్లను నిలుచోబెట్టి గెలిపిస్తా అన్న జగన్…సిట్టింగ్ స్థానాలను ఎందుకు మారుస్తున్నాడని, ఎందుకు గెలిపించలేకపోతున్నారని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసమో, టీడీపీ-జనసేన ప్రభుత్వం కోసమో ప్రయత్నించడం లేదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నానని చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో వైసీపీ నేత, ఎమ్మెల్సీ గట్టు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, మాజీ మంత్రి, వైసీపీ నేత దాడి వీరభద్రరావులతో పాటు పలు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని గట్టు అభిప్రాయపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates