మందుబాబులూ ఆంధ్రాలోనే కొనండ్రా !

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా మందుబాబుల కష్టాలు మామూలుగా లేవు. లాక్ డౌన్ కారణంగా మూతపబడ్డ మద్యం దుకాణాలు.. రెండు నెలల తర్వాత తెరుచుకున్నాయి కానీ.. అంతకుముందున్న పేరున్న బ్రాండ్లన్నీ తీసి అవతల పడేశారు. పైగా మద్యం రేట్లు విపరీతంగా పెంచి అమ్మడం మొదలుపెట్టారు.

లాక్ డౌన్ వల్ల తలెత్తిన నష్టాన్ని పూడ్చుకునేందుకు తాత్కాలికంగా మద్యం ధరలు పెంచారని.. మళ్లీ తగ్గిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. అసలే ఊరూ పేరూ లేని లోకల్ బ్రాండ్లు. పైగా అధిక ధరలు. మామూలుగానే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటే.. ఇలాంటి బ్రాండ్లు తాగితే పరిస్థితి మరీ దారుణం అంటున్నారు నిపుణులు.

ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో మద్యం తెప్పించుకుని తాగుతున్నారు మందుబాబులు. ఈ మధ్య హైకోర్టు వేరే రాష్ట్రం నుంచి మూడు ఫుల్ బాటిళ్లు తెచ్చుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది.

దీంతో మందు బాబులు లోకల్ మద్యం దుకాణాలకు వెళ్లడం తగ్గించేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన మద్యాన్ని కొంచెం ఎక్కువ రేటు పెట్టి అయినా కొంటున్నారు. ఇది ఏపీ మద్యం ఆదాయంపై ప్రభావం చూపుతోందని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేత, విజయవాడ ఎంపీ క్యాండిడేట్ పొట్లూరి వరప్రసాద్.. ట్విట్టర్లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

‘‘మందుబాబులు, కాస్త మన ఊళ్ళోనే కొనండ్రా!! ఆదాయం మన ఆంధ్రాకి ఇద్దాం.. పన్నులు తగ్గించారు, ఇక అంతా ఒకటే రేటు. కష్టకాలం అని ఎక్కువ తాగితే ఆరోగ్యానికే బొక్క. జర పైలం సుమీ..’’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఐతే ఈ ట్వీట్ మీద నెటిజన్లు చాలామంది విమర్శలు గుప్పించారు. మద్యపాన నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన పార్టీకి సంబంధించిన నేత.. మన ఊళ్లోనే మద్యం కొనండి, మన ఆంధ్రాకు ఆదాయం ఇవ్వండి అని అడగడమేంటి అని కొందరు ప్రశ్నిస్తే.. ఎక్కువ రేట్లు పెట్టి ఊరూ పేరూ లేని బ్రాండ్లు అమ్ముతూ.. మళ్లీ ఈ సమర్థింపు ఏమిటని అడిగారు.