వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకం ఎలా?

సభకు రాలేదు.. కానీ సంతకాలు మాత్రం ఉన్నాయి.. అదెలా..? ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

కొందరు సభ్యులు సభకు వచ్చినట్లుగా హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసి, సమావేశాల్లో పాల్గొనకుండా తిరిగి వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారం శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టికి వెళ్లడంతో, కమిటీ సమావేశమై దీనిపై కీలక చర్చ జరిపింది.

అసెంబ్లీ కమిటీ హాలులో ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారాన్ని సీరియస్‌గా పరిశీలించారు. కమిటీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు సమావేశానికి హాజరయ్యారు.

అసెంబ్లీ అధికారుల నివేదిక ప్రకారం, సభకు హాజరు కాకుండానే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు వేతనాలు పొందుతుండగా, వారిలో కొందరు టీఏ, డీఏలను కూడా క్లెయిమ్ చేసినట్లు వెల్లడైంది. ప్రజాప్రతినిధులు శాసనసభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, అర్హత లేకున్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఆ హోదా ఇస్తేనే సభకు వస్తామని చెప్పడం దేశ శాసనసభ చరిత్రలోనే అపూర్వమని వ్యాఖ్యానించారు. సంబంధిత ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలన్న ప్రతిపాదనపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే తుది నిర్ణయానికి ముందు న్యాయ నిపుణులు, మేధావులు, ప్రజాసంఘాల అభిప్రాయాలను సేకరించాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఎథిక్స్ కమిటీ తీసుకునే నిర్ణయంపై వైసీపీ ఎలా స్పందిస్తుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.