గాడ్ ఆఫ్ వార్… త్రివిక్ర‌మ్ కంటే ముందు ఇంకో ద‌ర్శ‌కుడు?

తెలుగులో, అలాగే ఇతర భాషల్లో అనేక మంది దేవుళ్ల మీద సినిమాలు వ‌చ్చాయి. శివుడి మీద అయితే సినిమాల‌కు లెక్కే లేదు. అనేక సినిమాల్లో వినాయకుడి పాత్ర‌ను కూడా చూశాం. కానీ శివుడి చిన్న కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి కథ గురించి సినిమాల్లో చూపించిన సందర్భాలు అరుదు. ఇప్పుడు ఆ దేవుడి మీద సినిమా అనేస‌రికి అంద‌రూ అమితాస‌క్తి చూపించారు.

అందులోనూ త్రివిక్ర‌మ్ లాంటి అగ్ర ద‌ర్శ‌కుడు తొలిసారిగా మైథ‌లాజిక‌ల్ ప్రాజెక్టు చేయ‌బోతూ.. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి క‌థ‌ను చెప్పాల‌నుకోవ‌డంతో క్యూరియాసిటీ పెరిగింది. ఈ ప్రాజెక్టు గ‌త రెండేళ్లుగా చ‌ర్చ‌ల్లో ఉంది. ముందు అల్లు అర్జున్ గాడ్ ఆఫ్ వార్‌గా పేరున్న సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి క్యారెక్ట‌ర్ చేస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఆ త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ ఆ సినిమా బ‌న్నీ వైపు వెళ్లిందంటున్నారు. ఈ క‌న్ఫ్యూజ‌న్ ఇలా న‌డుస్తుండ‌గా.. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి మీద వేరే సినిమా చ‌ర్చ‌ల్లోకి రావ‌డం విశేషం.

నేను శైల‌జ‌, చిత్ర‌ల‌హ‌రి లాంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల కూడా సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి క‌థ చేయాల‌నుకున్నాడ‌ట‌. ఇందుకోసం గౌరీ త‌న‌య పేరుతో నాలుగేళ్ల ముందే స్క్రిప్టు ప‌నులు మొద‌లుపెట్టాడ‌ట‌. క‌థ కూడా రెడీ అయింద‌ట‌. ఐతే పెద్ద స్పాన్ ఉన్న క‌థ కావ‌డంతో ఎక్కువ బ‌డ్జెట్, పేరున్న న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు అవ‌స‌రమ‌ని.. అందుకోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని కిషోర్ తిరుమ‌ల తెలిపాడు.

ఇప్ప‌టిదాకా ప్రేమ‌క‌థ‌లు, ఫ్యామిలీ స్టోరీలే డీల్ చేసిన కిషోర్.. ఇంత పెద్ద క‌థ రాసి భారీ బ‌డ్జెట్లో సినిమా తీయ‌గ‌ల‌డ‌ని ఎవ‌రూ అనుకోరు. కానీ రంగంలోకి కానీ ద‌ర్శ‌కుల అస‌లు స‌త్తా ఏంట‌న్న‌ది అర్థం కాదు. మ‌రి కిషోర్‌ను న‌మ్మి ఏ నిర్మాత అయినా భారీ బ‌డ్జెట్ పెట్టి ఈ సినిమా తీసే ప్ర‌య‌త్నం చేస్తాడేమో చూడాలి.

అంత‌కంటే ముందు ర‌వితేజ హీరోగా కిషోర్ డైరెక్ట్ చేసిన భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించాలి. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 13న ఈ చిత్రం విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.