ఫ్యామిలి ప్యాకుల కోసం ట్రై చేస్తున్నారా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ల కోసం సీనియర్ నేతలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఉత్సాహంతో పాటు గెలుపు ధీమా కూడా పెరిగినట్లుంది. అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో తమకు లేదా తమ కుటుంబసభ్యుల్లో ఒకరికి కచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే అని కాంగ్రెస్ సీనియర్లు పట్టుబడుతున్నారు. వీరిలో మంత్రులు, ఎంఎల్ఏలు కూడా ఉన్నారు. ముందుగా రేవంత్ రెడ్డితో ఒకమాట చెప్పి వెంటనే అధిష్టానం పెద్దలతో కూడా మంతనాలు మొదలుపెట్టినట్లు పార్టీవర్గాల సమాచారం.

మొన్ననే నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ అసెంబ్లీకి జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి గెలిచారు. ఇపుడు నల్గొండ ఎంపీ టికెట్ తనకు లేదా పెద్దకొడుకు రఘువీర్ రెడ్డికి ఇవ్వాలని జానారెడ్డి పట్టుబడుతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచి మంత్రయిన విషయం తెలిసిందే. జిల్లాలో కాంగ్రెస్ ఘనవిజయంలో పొంగులేటి పాత్ర చాలానే ఉంది. అందుకనే ఖమ్మం ఎంపీగా తన తమ్ముడు ప్రసాదరెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. తన తమ్ముడికి టికెట్ ఇస్తే పోరుగునే ఉన్న మహబూబాబాద్ ఎంపీ సీటును కూడా తాను గెలిపిస్తానని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ఇక కరీంనగర్ ఎంపీగా తన తమ్ముడు శ్రీనుబాబుకు ఇప్పించుకునేందుకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గట్టి ప్రయత్నాలే మొదలుపెట్టారట. అయితే ఎంపీగా ఎంఎల్సీ జీవన్ రెడ్డి కూడా గట్టిగా ప్రయత్నిస్తుండటంతో శ్రీనుబాబుకు టికెట్ ఏమవుతుందో చెప్పలేకున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా తనకు లేదా తన కొడుకు అనీల్ యాదవ్ కు ఎవరో ఒకరికి ఇవ్వాలని అంజన్ కుమార్ యాదవ్ గట్టిగా పట్టుబడుతున్నారు. తమిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తామంటున్నారు.

అలాగే పెద్దపల్లి ఎంపీ టికెట్ తన కొడుకు వంశీకి ఇవ్వాలని చెన్నూరు ఎంఎల్ఏ వివేక్ వెంకటస్వామి గట్టిగా కోరుతున్నారు. తమకు టికెట్ ఇస్తే పొరుగునే ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ లోక్ సభ సీట్లలో గెలుపుకు అవసరమైన సహకారం అందిస్తామని బంపరాఫర్ ఇస్తున్నారట. వీళ్ళ ఆఫర్లు ఎలాగున్నా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకు టికెట్ లేదని, కుటుంబంలో ఒకళ్ళకే టికెట్ అంటే అంజన్ కుమార్ యాదవ్, జీవన్ రెడ్డి, పొంగులేటి, దుద్దిళ్ళ, జానారెడ్డి, వివేక్ లాంటి వాళ్ళు పోటీలో నుండి ఎగిరిపోతారు. మరి అధిష్టానం ఏమంటుందో చూడాలి.