ఎస్టీ స్థానాల్లో లెక్క‌కు మించిపోయారుగా!

సాధార‌ణంగా ఎస్టీ అసెంబ్లీ స్థానాలను తీసుకుంటే.. అది ఏ పార్టీ అయినా.. పోటీ చేసేందుకు నాయ‌కుల సంఖ్య పెద్ద‌గా ఉండేది కాదు. ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే పోటీ ప‌డేవారు. వారిలోమెరుగైన వారిని పార్టీలు ఎంపిక చేసుకుని టికెట్లు ఇచ్చేవి. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు ఇక్క‌డ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌దు కాబ‌ట్టి.. ఎస్టీల్లో నే పోటీ కూడా ఉండేది. కొన్ని క‌ట్టుబాట్లు.. కొన్ని ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా మిగిలిన నాయ‌కులు స‌ర్దుకు పోయేవారు. అయితే.. మారుతున్న‌కాలంలో మారుతున్న‌కాలానికి అనుగుణంగా ఎస్టీల్లోనూ రాజ‌కీయ నాయ‌కులు పెరిగారు.

ఇది మంచి ప‌రిణామ‌మే. రాజ‌కీయంగా కూడా ఎస్టీలు ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. ఈ ప‌రిణామం ఇప్పుడు అటు అధికార‌వైసీపీ, ఇటు టీడీపికి కూడా త‌ల‌కు మించిన భారంగా మారిపోయిం ది. ఎందుకంటే.. ఎస్టీ స్థానాల్లో ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా లెక్క‌కు మించిన స్థాయిలో నాయ‌కులు పోటీ కి రెడీఅంటూ కాలుదువ్వుతున్నారు. అంతేకాదు.. వీరిలోనూ.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, ఫిర్యాదు లు ప‌ర్వాలు కొన‌సాగుతున్నాయి. దీంతో ఎవ‌రిని కాదంటే ఏం జ‌రుగుతుందో అనే చ‌ర్చ పార్టీల‌ను త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురిచేస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్టీ స్థానాల్లోనూ వైసీపీ విజ‌య‌ఢంకా మోగించింది. ఇక ఇప్పుడు కూడా.. అదే ప‌రంపర కొన‌సాగుతుంద‌ని నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు. దీంతో ఒక్కొక్క సీటుకు లెక్కకు మించిన నాయ‌కులు త‌ల‌ప‌డేందుకు రెడీగా ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు  అరకులో య ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణను వ్యతిరేకిస్తున్న వారు ఆ నియోజకవర్గంలో పెరుగుతున్నారు. ఓ జడ్పీటీసీ సభ్యుడితో పాటు, విద్యాశాఖ అధికారి ఒకరు ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఎమ్మెల్యే ఫాల్గుణ‌ను మార్చాలని ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్‌ చేసింది. ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టిలో ఉంది. అంటే మొత్తంగా సిట్టింగుతో పాటు ముగ్గురు ఈ సీటు కోసం త‌ల‌ప‌డుతున్నారు. ఇక‌, టీడీపీలోనూ ఇంతే స్థాయిలో పోటీ ఉంది. ఇక‌, మ‌రో కీల‌క నియోజ‌వ‌ర్గం పాడేరు. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచిన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఈసారీ తనకే అవకాశం ఇస్తారని విశ్వాసం తో ఉన్నారు.

అయితే.. ఈ స్థానం ద‌క్కించుకునేందుకు వైసీపీలో ఉన్న  మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, పసుపులేటి బాలరాజు తమ కుమార్తెలకు టికెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు ట్రైకార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎంపీ గొడ్డేెటి మాధవి ఈ సీటును ఆశిస్తు న్నారు. దీంతో ఎవ‌రిని అధిష్టానం క‌రుణిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. మొత్తానికి ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జ‌న‌ర‌ల్ స్థాయి పోటీ పెరిగిపోవ‌డంతో పార్టీలు త‌ల‌లు ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.