బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఫిట్టింగ్ పెట్టిందా?

నీవు నేర్పిన విద్యయే అన్న పద్దతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటాన్ని బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. అందుకనే మంత్రుల పర్యటనల్లో కావాలనే ప్రోటోకాల్ వివాదాన్ని తెస్తోంది. ప్రటోకాల్ పాటించటంపై తొందరలోనే కోర్టులో కేసులు వేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే జనగామ నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ సమీక్ష చేశారు. ఆ సమీక్షలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు ఓడిపోయిన కాంగ్రెస్ నేతను కూడా మంత్రి వేదిక మీద కూర్చోబెట్టారు. దాన్ని పల్లా తీవ్రంగా వ్యతరేకించారు.

ఓడిపోయిన అభ్యర్ధిని వేదికపైన తనతో సమానంగా ఎలా కూర్చోబెడతారన్నది పల్లా పాయింట్. అయితే ఇక్కడే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ ఫిట్టింగ్ పెడుతోంది. ఎలాగంటే పదేళ్ళ కేసీయార్ పాలనలో ఇదే జరిగింది. మంత్రుల సమీక్షల్లో కాంగ్రెస్, బీజేపీ ఎంఎల్ఏలను కాదని ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్ధులకే పెద్దపీట వేసింది. ఓడిపోయిన అభ్యర్ధులనే నియోజకవర్గాల ఇన్చార్జిలుగా కేసీయార్ ప్రభుత్వం నియమించింది. ఇన్చార్జిల పేరుమీదే నియోజకవర్గాల్లో కార్యక్రమాలను నడిపింది. ఇవన్నీ అప్పట్లో ఎంఎల్సీగా పనిచేసిన పల్లాకు తెలియంది కాదు.

అన్నీ తెలిసినా ఇపుడు కావాలనే మంత్రితో  పల్లా గొడవ పెట్టుకున్నారు. మంత్రి కూడా ఎంఎల్ఏని లెక్కచేయలేదు. సమావేశంలో ఉంటే ఉండండి లేకపోతే పొమ్మన్నారు. దాంతో మండిపోయిన పల్లా సమావేశం నుండి వెళ్ళిపోయారు. తమ పదేళ్ళ హయాంలో కూడా ఇలాగే జరిగిన విషయాన్ని మరచిపోయినట్లే పల్లా వ్యవహరిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. కేసీయార్ పాలనలో ప్రోటోకాల్ పాటించాలని కాంగ్రెస్, బీజేపీ ఎంఎల్ఏలు ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు.

ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం నయమనే చెప్పాలి. ఎలాగంటే సమావేశానికి బీఆర్ఎస్ ఎంఎల్ఏని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టింది. కాకపోతే ఎంఎల్ఏతో పాటు ఓడిపోయిన నేతను కూడా కూర్చోబెట్టిందంతే. తనను కాదని ఓడిపోయిన నేతనే కూర్చోబెడితే పల్లా అభ్యంతరం చెప్పినా అర్ధముంటుంది. తమ హయాంలో అసలు కాంగ్రెస్, బీజేపీ ఎంఎల్ఏలను పిలిచిన పాపాన కూడా పోలేదని పల్లాకు తెలీదా ? ఏదో ఒక సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదచల్లేయాలన్న ఆలోచననే బీఆర్ఎస్ లో కనబడుతోంది. మరి ప్రోటోకాల్ రగడ కోర్టుకెక్కితే ఏమవతుందో చూడాలి.