మెట్రో లైన్ల ఖర్చుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో మెట్రో, ఫార్మాసిటీని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయబోతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే మెట్రో మార్గాన్ని తగ్గిస్తామని ఆయన వెల్లడించారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉందని, ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీ మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు మెట్రో ను పొడిగిస్తామని చెప్పారు. ఇక, కొత్తగా ప్రతిపాదించే మెట్రో లైన్లు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయని రేవంత్ చెప్పారు. మరోవైపు, సోమవారం నాడు నాంపల్లి గ్రౌండ్స్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేలాది మంది వ్యాపారవేత్తలు ఈ నుమాయిష్ లో పాల్గొంటారని అన్నారు. హైదరాబాద్ పేరు చెబితే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకు వస్తాయన్నారు. ఎన్నో హస్త కళలు, చేనేత కళలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ విక్రయిస్తారని, ప్రదర్శిస్తారని అన్నారు. నుమాయిష్ కమిటీలలో మహిళలకు ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు.

కాగా, ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ విజయవంతంగా ప్రయోగించడంపై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు రేవంత్ అభినందనలు తెలిపారు. అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్ ను అధ్యయనం చేసేందుకు అబ్జర్వేటరీ ఉపగ్రహం ఉన్న రెండో దేశంగా భారత్ అవతరించిందని ప్రశంసించారు. కాగా, నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో రేవంత్ రెడ్డికి పూల మొక్కను బహూకరించి బండ్లన్న న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.‌