రాహుల్ గాంధీ తో షర్మిల భేటీ

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైఎస్ షర్మిలకు ముహూర్తం రెడీ అయ్యిందా ? అవుననే సమాచారం వస్తోంది కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి. ఈనెల 3 లేదా 7వ తేదీన పార్టీలోకి షర్మిల ఎంట్రీ ఉండచ్చని అంచనా అనుకుంటున్నారు. ఎంట్రీతో పాటు మరిన్ని విషయాలు మాట్లాడుకునేందుకు షర్మిల మంగళవారం ఢిల్లీకి వెళ్ళి రాహూల్ గాంధీతో భేటీ అవబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పెద్దలకు షర్మిలకు మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయట.

పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే అధిష్టానం షర్మిల ముందు రెండు ఆప్షన్లుంచిందట. అదేమిటంటే ఏపీ పార్టీ పగ్గాలు అందుకున్నాక  కర్నాటక లేదా తెలంగాణా నుండి రాజ్యసభకు నామినేట్ అవ్వటం. రెండో ఆప్షన్ ఏమిటంటే పార్టీపగ్గాలు అందుకున్నాక రాబోయే ఎన్నికల్లో కడప లోక్ సభకు పోటీచేయటం. ఈ రెండు ఆప్షన్లలో  షర్మిల దేనివైపు మొగ్గుచూపుతుందన్న విషయం ఇపుడు ఆసక్తిగా మారింది. ఆప్షన్ ఏదైనా మెయిన్ టార్గెట్ సోదరుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే అన్న విషయం అర్ధమవుతోంది.

జగన్ను టార్గెట్ చేయటం ఇష్టంలేకే షర్మిల తెలంగాణాలో వేరుకుంపటి పెట్టుకున్నారు. అయితే తెలంగాణాలో ఉనికి కూడా చాటుకోలేకపోయిన నేపధ్యంలో వేరేదారిలేక తిరిగి ఏపీలోకి రావాల్సొస్తోంది. కాంగ్రెస్ లో చేరకపోతే ఏమి చేసుండేవారో కానీ ఇపుడు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోక తప్పటంలేదు. కాబట్టి జగన్ను టార్గెట్ చేయకా తప్పదు. దాంతో రాబోయే ఎన్నికల్లో వైఎస్ కుటుంబంలోని విభేదాలన్నీ రోడ్డున పడటం ఖాయమని అర్ధమవుతోంది. ఇదే సందర్భంగా పార్టీని బలోపేతం చేయటంలో ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలమేయటం కూడా  ఎజెండాలో బాగమే.

రాబోయే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలో టికెట్లు దక్కని సీనియర్లకు గాలమేసి అలాంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ లో చేర్పించే బాధ్యత కూడా షర్మిల మీదే ఉంటుంది. ఆ రకంగా కాంగ్రెస్ కు సడెన్ బూస్టప్ వచ్చినట్లవుతుంది. తక్కువలో తక్కువ ఓ 20 మంది ఎంఎల్ఏలు, మరికొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్ తరపున పోటీలోకి దిగితే ఎంతో కొంత ప్రభావం ఉండటం ఖాయం. ఆ రకంగా కాంగ్రెస్ బలోపేతమవ్వాలని ఆలోచిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.