టికెట్ ఎఫెక్ట్‌.. మైల‌వ‌రంలో తొలి రాజీనామా!

వైసీపీలో టికెట్ల వేడి కొనసాగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న సిట్టింగులు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్‌ను ఆశిస్తున్న‌వా రు కూడా.. పొలిటిక‌ల్ సెగ పెంచుతున్నారు. టికెట్ ఇవ్వాల్సిందేన‌న్న ప‌ట్టుతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు త‌మ దారి తాము చూసుకుంటున్నారు. మ‌రికొందరు వేచి చూస్తున్నారు. చాలా త‌క్కు వ సంఖ్య‌లో మాత్ర‌మే స‌ర్దుకు పోతున్నారు. తాజాగా ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో  టికెట్ ఆశిస్తున్న కీల‌క నాయ‌కుడు పార్టీకి రాజీనామా చేశారు.

మైలవరం మండ‌లం మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ బొమ్మసాని చలపతి రావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ను ఆశించారు. దీనికి మంత్రి జోగి ర‌మేష్ కూడా భ‌రోసా ఇచ్చారు. నేను ఉన్నాను.. నీకు టికెట్ ఇప్పిస్తాన‌ని చెప్పారు. కానీ, ప్ర‌స్తుతం మారిన ప‌రిణామాల నేప‌థ్యంలో టికెట్ల వ్య‌వ‌హారం ఎవ‌రిచేతిలోనూ లేకుండా పోవ‌డం.. స‌ర్వేల‌పైనే ఆధార‌ప‌డి టికెట్లు ఇస్తున్న నేప‌థ్యంలో బొమ్మ‌సానికి నిరాశే ఎదురైంది.

దీంతో ఆయ‌న తాజాగా పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వ‌స్తుంద‌ని ఆశించాన‌ని.. కానీ, అది జ‌రిగే ప‌నికాద‌ని ఆల‌స్యంగా తెలిసింద‌ని అన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైఖరీకి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు బొమ్మసాని ప్రకటించారు. పార్టీ కష్టకాల సమయంలో పని చేస్తే తనకు విలువ ఇవ్వకపోవడంఫై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి జోగి రమేష్‌పైనా బొమ్మ‌సాని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చందాలు ఇచ్చి అండగా ఉన్న త‌న‌కు టికెట్ ఇప్పిస్తాన‌ని హామీ ఇచ్చి కూడా పట్టించుకోలేద‌ని  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వీటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయం సొంత ఎస్టేట్‌గా మార్చి.. ఇంచార్జులు సూపర్‌వైజర్లుగా, పార్టీ నాయకులు, కార్యకర్తలను స్వీపర్లుగా ఎమ్మెల్యే  మార్చారని బొమ్మసాని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.