పవన్ టార్గెట్ రీచవుతారా ?

జనసేన అధినేత రెండు టార్గెట్లను పెట్టుకున్నారు. మొదటిది పోటీ చేయబోయే సీట్ల సంఖ్య. రెండోది పోటీ చేయబోయే సీట్లలో గెలుపు సంఖ్య. రెండోది తేలాలంటే ముందు మొదటి దానిపై క్లారిటి రావాలి. అందుకనే సీట్ల సంఖ్యపై ఒకటికి రెండుసార్లు సర్వేలు చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగానే కాకినాడ సిటీలో మూడు రోజులు క్యాంపు వేశారు. ఈ మూడు రోజుల్లో కాకినాడ జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలోని 14 నియోజకవర్గాలపై విస్తృతమైన సమీక్షలు చేశారు.

పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే ఉభయగోదావరి జిల్లాల్లో కచ్చితంగా 15 సీట్లలో పోటీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఉభయగోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలున్నాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 19 సీట్లుంటే పశ్చిమగోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. జనసేన పోటీచేయబోయే సీట్లలో అత్యధికం ఈ రెండు జిల్లాల్లో ఉండబోతోందనే ప్రచారం చాలాకాలంగా జరగుతోంది. పోయిన ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. ఇదే సమయంలో పది నియోజకవర్గాల్లో 30 వేలకు పైగా ఓట్లొచ్చాయి.

ఒంటరిగా పోటీ చేస్తేనే, ఎలాంటి సంస్థాగతమైన నిర్మాణం లేకుండానే అన్ని వేల ఓట్లొచ్చినపుడు టీడీపీతో పొత్తు కారణంగా ఆ నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలుస్తామని పవన్ బలంగా నమ్ముతున్నారట. ఉమ్మడి జిల్లాల్లో 7 సీట్లు రిజర్వుడు సీట్లున్నాయి. వీటిల్లో ఐదు సీట్లు ఎస్సీలకు, రెండు ఎస్టీలకు కేటాయించున్నాయి. వీటిల్లో కూడా బలమైన అభ్యర్ధులనే పోటీలోకి దింపాలని పవన్ నిర్ణయించారు. ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీచేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టే వారాహియాత్ర కావచ్చు లేదా ఇతరత్రా కారణాలతో ఈ రెండు జిల్లాల్లోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు. అభిమానులు, క్యాడర్, సామాజికవర్గపరంగా చూసుకున్నా రెండు జిల్లాల్లోనే బలం ఎక్కువగా ఉంది.

అయితే అభిమానులు, క్యాడర్ సంఘటితంగా లేకపోవటమే పార్టీకి పెద్ద మైనస్ అయ్యింది. అందుకనే ఈసారి మొదటినుండి ఒక పద్దతిప్రకారం పార్టీ సభ్యత్వాలను చేయించారు. టీడీపీతో పొత్తు కారణంగా క్యాడర్ బలం కూడా కలిసొస్తుందని పవన్  నమ్ముతున్నారు. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే కాకినాడ సిటి నియోజకవర్గంలో పోటీచేసే విషయంలో పవన్ ఆలోచిస్తున్నారు. వైసీపీ ఎంఎల్ఏ ద్వారంపూడిని ఎలాగైనా ఓడించి దెబ్బకొట్టాలనే కసితో పవన్ రగిలిపోతున్నారు. మరి పవన్ టార్గెట్ రీచవుతారా?