ఆత్మహత్యకు అనుమతివ్వండి.. గవర్నర్‌కు కుటుంబం లేఖ

ఇదొక విచిత్రమైన వ్యవహారం. తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఒక కుటుంబం రాష్ట్ర గవర్నర్‌కు, హైకోర్టుకు లేఖలు రాసింది. తమ ఊరి వాళ్లే తమను వెలి వేయడమే ఇందుకు కారణం. ఈ ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఉదంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లి కలెక్టరుతో విచారణ జరిపించే వరకు వ్యవహారం వెళ్లింది. ఇంతకీ విషయం ఏంటంటే..

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు.. ఊరికి చెందిన మూడున్నర ఎకరాల పొలాన్ని అక్రమంగా తన పేరిట రాయించుకున్నందుకు గాను అతడి కుటుంబాన్ని గ్రామం నుంచి వెలి వేస్తున్నట్లు గ్రామ పెద్దలు పంచాయితీలో ప్రకటించారు. ఆ కుటుంబానికి చెందిన ఎవరితోనైనా మాట్లాడితే పది వేల రూపాయల జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించారు. దీంతో అప్పట్నుంచి ఆ కుటుంబంతో అందరూ సంబంధాలు తెంచుకున్నారు.

ఐతే వెంకటేశ్వర్లు మనవరాలు కొన్ని నెలల కిందటే దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసింది. దీంతో ఆయన ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. తర్వాత జాయింట్ కలెక్టర్ ఆ ఊరికి వెళ్లి గ్రామస్థులకు నచ్చజెప్పారు. వెంకటేశ్వర్లు కుటుంబంతో కలిసి మెలిసి ఉండాలని చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా ఆ కుటుంబాన్ని గ్రామస్థులు ఆదరించలేదు. దూరంగానే ఉంచారు.

దీంతో ఇప్పుడు ఆ కుటుంబం తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు, హైకోర్టుకు లేఖలు రాసింది. గ్రామస్థులందరూ వెలివేయడంతో తాము ఏడాదిగా నరకం చూస్తున్నామని వాళ్లు అంటున్నారు. ఈ విషయమై మీడియాలో వార్తలు రావడంతో అందరి దృష్టి ఆ గ్రామంపై పడింది. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తమ బాధనంతా ఒక ఫ్లెక్సీ మీద రాయించి దాన్ని పట్టుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో మరోసారి అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.