తెలంగాణా బీజేపీకి షాక్ తప్పదా?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోపు తెలంగాణా బీజేపీకి షాక్ తప్పేట్లులేదు. పార్టీలోని ముగ్గురు కీలకమైన నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. నిప్పులేనిదే పొగరాదన్నట్లుగానే జరుగుతున్న ప్రచారాన్ని చూడాల్సుంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు మరో ప్రముఖ నేత కూడా బీజేపీకి తొందరలో రాజీనామాలు చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. కాంగ్రెస్ లో చేరబోయే ముగ్గురు నేతలు కూడా పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటం ఖాయమంటున్నారు.

తాను పార్టీమారుతానని జరుగుతున్న ప్రచారం ఉత్తదే అని ఈటల చెప్పినా ప్రచారమైతే ఆగటంలేదు. అందుకు కారణం ఏమిటంటే ఈటల వ్యవహారశైలనే చెప్పాలి. బీజేపీలో ఈటల అంత కంఫర్టబుల్ గా లేరని అందరికీ తెలిసిందే. పైగా బీజేపీకి అనుకున్నంత ప్రజాధరణ కూడా దక్కలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లయితే పెంచుకున్నది కానీ ఆశించిన స్ధాయిలో సీట్లు గెలవలేదు. దానికి కారణం ఏమిటంటే బీజేపీ అగ్రనేతలనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి.

మంచి రైజ్ మీదున్నపార్టీని అగ్రనేతల నిర్ణయాలే దెబ్బకొట్టినట్లు పార్టీ నేతలతో పాటు మామూలు జనాలు కూడా చెప్పుకుంటున్నారు. నరేంద్రమోడీ-కేసీయార్ కుమ్మక్కయ్యారన్న ప్రచారం పార్టీని బాగా డ్యామేజి చేసింది. ఈ ఒక్క ప్రచారంతో మంచి స్పీడుమీదున్న పార్టీ జోరుకు ఒక్కసారిగా బ్రేకులు పడిపోయాయి. దాంతో మళ్ళీ పార్టీ స్పీడందుకోలేదు. దాని ప్రభావం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని జనాలు అనుకోబట్టే కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించారు.

ఇవన్నీ గమనించిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీకి దెబ్బతప్పదని ఈటల భావించినట్లు తెలుస్తోంది. అందుకనే కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. కాంగ్రెస్ అధికారప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ సాక్ష్యంగా నిలిచింది. తన ట్వీట్లో తొందరలోనే బీజేపీ బీసీ సీఎం అభ్యర్ధి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సామా చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో  బీసీ సీఎం అభ్యర్ధిగా ప్రొజెక్టయ్యింది ఈటల మాత్రమే. అందుకనే ఈటల కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం రోజురోజుకు పెరిగిపోతోంది.