టీడీపీకి ‘ఐటీ సైన్యం’.. చంద్ర‌బాబు వ్యూహం

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆదిశ‌గా ఇప్పుడు వ్యూహానికి మ‌రింత ప‌దును పెంచారు. ఇప్ప‌టి వ‌ర‌కు సీబీఎన్ ఆర్మీ, ఐటీడీపీ, వ్యూహ‌క‌ర్త‌లు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, అదికార ప్ర‌తినిధులుగా ఉన్న సైన్యాన్ని మాత్ర‌మే రంగంలోకి దింపుతున్నారు. అయితే. ఇప్పుడు ఐటీ సైన్యాన్ని సైతం ఎన్నిక‌ల‌కు వినియోగించుకునేందుకురెడీ అయ్యారు. ఐటీ సైన్యం అంటే.. ఎవ‌రో కాదు చంద్ర‌బాబు చేత‌, చంద్ర‌బాబు వ‌ల‌న ఐటీ విద్య‌ను అభ్య‌సించిన వారే.

వారిలోనూ టీడీపీ అన్నా..చంద్ర‌బాబు అన్నా సింప‌తీ చూపించేవారినే తాజాగా చంద్ర‌బాబు ఐటీ సైన్యంగా పేర్కొన్నారు. తాజాగా బెంగ‌ళూరులో ప‌ర్య‌టించిన‌ చంద్ర‌బాబుకు అక్క‌డి ఐటీ ఉద్యోగుల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్బంగా వారిని ఉద్దేశించి చంద్ర‌బాబు మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్‌ని బాగు చేసేందుకు మీరు ఏం చేయగలరో ప్లాన్ చేయండి. వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి. వచ్చే ఎన్నికలు ఎందుకు ముఖ్యమో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలి” అని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు ఐటీ ఉద్యోగుల‌కు మ‌రో టార్గెట్ కూడా పెట్టారు. ఉద్యోగులు సంపాయిస్తు న్న వేత‌నంలో నూటికి 5 రూపాయ‌లు ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌మాజం కోసం ఖ‌ర్చు చేయాల‌ని పిలుపునిచ్చారు. “సమాజహితం కోసం మీరు కష్టపడాలి. నాకోసం నేను క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. నేను చేసే పనులు తర తరాల కోస‌మే. వారి అభ్యున్న‌తి కోస‌మే. వారు గుర్తుపెట్టుకోవాలి. చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటే నా జన్మ దన్యమైనట్లే” అని చంద్రబాబు పేర్కొన్నారు.