ఇంగ్లిషు మీడియం విషయంలో జగన్ కు సుప్రీం షాక్

గత కొద్ది నెలలుగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు, సుప్రీం కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు….ఇళ్ల స్థలాల పంపిణీ….ఇలా దాదాపుగా అనేక విషయాల్లో జగన్ సర్కార్ కు న్యాయస్థానాల్లో చుక్కెదురైంది.

మరోవైపు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో బోధన వ్యవహారంపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు గడప తొక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా, మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలు వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు దేశపు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎస్‌ఎల్‌పీ, స్టేపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం….ఈ కేేసు తదుపరి విచారణను సెప్టెంబరు 25కు వాయిదా వేసింది.

ఏపీలోని సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మాతృభాషలోనే విద్యనభ్యసించాలనుకునే వారికి ఆ అవకాశం ఇవ్వాలని, ఇంగ్లిషు మీడియం వల్ల పిల్లలు మాతృభాషను మరచిపోయే ప్రమాదముందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

అయితే, ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే ఇంగ్లిషు మీడియం తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది.ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి చేస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెం.81, 85ను హైకోర్టు కొట్టేయడంపై సుప్రీంలో పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు….హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

తాజా తీర్పుతో జగన్ సర్కార్‌కు మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కాగా, 5వ తరగతి వరకు మాతృభాష తప్పనిసరి అని నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ(ఎన్ఈపీ)-2020ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ విధానం అమలులోకి తేబోతున్నామని తెలిపింది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ఇంగ్లిష్ మీడియంపై ఏపీ సర్కార్ ఏ విధంగా ముందుకు పోతుందన్నది ఆసక్తికరంగా మారింది.