ఇట్లు.. మీ రేవంత్‌: మోడీకి టీ-సీఎం విన్న‌పాలు

తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 2014 నాటి ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం లోని అంశాల‌ను అమ‌లు చేయాల‌ని.. ఆయ‌న కోరారు. ఇచ్చిన హామీల‌కు ప‌దేళ్లు గ‌డిచిపోతున్నా.. ఎక్క‌డివ‌క్క‌డే ఉన్నాయ‌ని .. ఇప్ప‌టికైనా వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని ఆయ‌న విన్న‌వించారు. దాదారు 40 నిమిషాల పాటు సాగిన ప్ర‌ధాని మోదీతో బేటీలో తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కూడా పాల్గొన్నారు. ప్ర‌ధానితో భేటీ అనంత‌రం.. ఆయా వివ‌రాల‌ను భ‌ట్టి మీడియాకు వెల్ల‌డించారు.

విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంద‌ని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రయోజనా ల కోసం ప్రధానిని కలిశామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరామ న్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

విభజన చట్టం ప్రకారం ఒక మేజర్ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని అడిగామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరామన్నారు. తెలంగాణకు ఐఐఎం, సైనిక్ స్కూల్‌ మంజూరు చేయాలని అడిగామని చెప్పారు. బీఆర్ ఎస్‌ నేతల ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందన్నారు. అప్పుల్లో కూరుకున్న తెలంగాణ కు.. ఆర్థిక సాయం చేయాలని ప్రధానిమంత్రిని విన్న‌వించిన‌ట్టు తెలిపారు.