ష‌ర్మిల ఎఫెక్ట్‌.. టీడీపీకి లాభ‌మెంత‌…!

ఏపీలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత ఆస‌క్తిగా మారాయి. ఇప్ప‌టికే వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ రాజ‌కీయాలు సెగ‌లు పుట్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌మ‌కు క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను టీడీపీ అక్కున చేర్చుకుంటోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే జ‌న‌సేన‌తో టీడీపీ జ‌త‌క‌ట్టింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇరు పార్టీలూ కూడా క‌లిసి పోటీ చేయ‌నున్నాయి. ఇక‌, ఇప్పుడుమ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకుంది.

ఆది నుంచి టీడీపీ వ్య‌తిరేకిస్తున్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబం చంద్ర‌బాబు కుటుంబానికి జై కొట్టినట్టుగా రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. తాజాగా క్రిస్మ‌స్ను పుర‌స్క‌రించుకుని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌..టీడీపీ యువ‌నాయ‌కుడు నారా లోకేష్‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం, మిఠాయిలు పంపించ‌డం.. గ్రీటింగ్ కార్డు పంపడం.. క్రిస్మ‌స్ కేకును పంపించి.. నారా కుటుంబం వ‌చ్చే ఏడాదిలో ఆనందంగా ఉండాల‌ని ఆశించ‌డం వంటివి రాజ‌కీయంగా ప్రాదాన్యం సంత‌రించుకున్నాయి.

వాస్త‌వానికి ఏపీలో ఉన్న‌ది వైఎస్ ష‌ర్మిల సోద‌రుడి ప్ర‌భుత్వం. అయితే.. ఈ ప్ర‌భుత్వాన్ని దించేసి.. తాము అధికారంలోకి రావాల‌ని టీడీపీ ప్ర‌య‌త్నస్తున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్యంగా ష‌ర్మిల వ్య‌వ‌హ‌రించిన తీరుతో వైసీపీకి ఇబ్బందిక‌ర‌ ప‌రిణామాలు ఎదురవుతాయ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల వేళ‌.. ష‌ర్మిల త‌మ‌కు పంపించిన గ్రీటింగ్స్‌ను టీడీపీ ప్ర‌జాక్షేత్రంలో వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

దీంతో వైఎస్ సానుభూతిప‌రులు.. టీడీపీవైపు మొగ్గే చాన్స్‌ను కొట్టిపారేయ‌లేమ‌ని అంటున్నారు ప‌రిశీల కులు. ముఖ్యంగా క్రిస్టియ‌న్ ఓట్లు.. కూడా ఈ ప్ర‌భావానికి గురి కావొచ్చ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మొత్తంగా చూస్తే.. గ‌త ఎన్నిక‌ల్లో ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ కోసం ప్ర‌చారం చేసిన ష‌ర్మిల‌, ఆమె భ‌ర్త‌.. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకోవ‌డం.. వైఎస్ కుటుంబానికి వైరం ప‌క్షంగా ఉన్న‌టీడీపీని అభినందించ‌డం.. వ‌చ్చే ఏడాది మంచి జ‌ర‌గాల‌ని ఆశించ‌డం వంటివి రాజ‌కీయంగా తీవ్ర‌ప్ర‌భావం చూపుతాయ‌ని అంటున్నారు.