షర్మిలతో జగన్ కు చెక్.. ఇక ఏపీలో కాంగ్రెస్ ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సొంత చెల్లి షర్మిలతో చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందా? ఇక ఏపీలో పార్టీ ఆపరేషన్ మొదలెట్టేందుకు సిద్ధమైందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారం కోసం ప్రణాళికాబద్ధంగా సాగిన కాంగ్రెస్ లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు ఫోకస్ ను పక్కనే ఉన్న ఏపీపైకి షిప్ట్ చేసింది. మరో మూణ్నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అందుకే ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా మాణిక్యం ఠాగూర్ కు కాంగ్రెస్ బాధ్యతలు అప్పజెప్పింది.  

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మాణిక్యం ఠాగూర్ కీలక పాత్ర పోషించారు. రేవంత్ తో కలిసి పార్టీని గెలిపించుకున్నారు. దీంతో మాణిక్యం పేరు మార్మోగింది. ఇప్పుడు ఆయన సామర్థ్యాలను నమ్మి ఏపీలో పార్టీని పరుగులు పెట్టించే బాధ్యతను హైకమాండ్ అప్పగించింది. మరోవైపు వైఎస్ షర్మిలను అన్న జగన్ పైకి ప్రయోగించాలని కాంగ్రెస్ అనుకుంటోందని తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో తన పార్టీ వైఎస్సార్ టీపీని విలీనం చేయడం కోసం షర్మిల తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ఎన్నికలు ముగిసేంతవరకూ కాంగ్రెస్ వేచి చూడాలని పేర్కొంది. అందుకే ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు షర్మిల మద్దతునిచ్చారు.

ఇక ఇప్పుడు తెలంగాణలో షర్మిలతో కాంగ్రెస్ కు అవసరం లేదు. మరోవైపు షర్మిలకు కూడా తెలంగాణలో పెద్దగా ఆదరణ లేదు. అందుకే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని, ఏపీలో షర్మిలను యాక్టివ్ గా మార్చాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు షర్మిల క్రిస్మస్  బహుమతి పంపడం కూడా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ కీలక భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిలో బాబును చేర్చుకునేందుకు సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలో బాబు చేరే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బాబు, షర్మిలతో కలిసి జగన్ కు చెక్ పెట్టేలా కాంగ్రెస్ వ్యవహరించే అవకాశముంది.