ఔను.. ఆ రెండు వ‌ర్గాలు మాకు దూర‌మ‌య్యాయి

బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ ఓట‌మి గురించి.. ఆయ‌న తాజాగా ప్ర‌స్తావించారు.  రాష్ట్రంలోని రెండు వ‌ర్గాలు బీఆర్ ఎస్‌కు దూర‌మ‌య్యాయ‌ని, ఇదే త‌మ‌కు ఎన్నిక‌ల్లో ఓట‌మికి కార‌ణ‌మై ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ రెండు వ‌ర్గాలే..ఉద్యోగులు, నిరుద్యోగులు అని కేటీఆర్ చెప్పారు. వాస్త‌వానికి బీఆర్ ఎస్ పాల‌న‌.. ఉపాధి అవ‌కాశాల‌కు గ‌నిగా మారింది. అనేక ఉద్యోగాల నియామ‌కాలు చేప‌ట్టాం. అయితే.. దీనిని ఎన్నిక‌ల స‌మయంలో ప్ర‌చారం చేసుకోలేక పోయాం అని కేటీఆర్ అన్నారు.

ఇక‌, ఉద్యోగుల గురించి మాట్లాడూతూ.. దేశంలో భారీగా వేత‌నాలు పెంచిన స‌ర్కారు ఏదైనా ఉంటే అది కేసీఆర్ ప్ర‌భుత్వ‌మేన‌ని కేటీఆర్ చెప్పారు.  రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వేత‌నాలు పెంచామ‌న్నారు. పీఆర్సీని కూడా ప్ర‌క‌టించామ‌ని, ఎన్నిక‌ల సంఘంతో చ‌ర్చించి ఎన్నిక‌ల‌కు ముందు డీఏ బ‌కాయిలు కూడా విడుద‌ల చేశామ‌ని కేటీఆర్ తెలిపారు. అయిన‌ప్ప‌టికీ.. ఉద్యోగుల విష‌యంలో మేం ప్ర‌చారం చేసుకోలేక పోయామ‌ని కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ రెండు వ‌ర్గాలు అందుకే త‌మ‌కు దూర‌మ‌య్యాయ‌ని ఆయ‌న ఒప్పుకొన్నారు.

అయితే.. భ‌విష్య‌త్తులో త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, స‌రిచేసుకుంటామ‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఎదురైన ఓట‌మి కేవ‌లం స్పీడ్ బ్రేక‌ర్ మాత్ర‌మేన‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. తాజాగా రేవంత్ స‌ర్కారు విడుద‌ల చేసిన శ్వేత ప‌త్రానికి దీటుగా త‌మ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధిని, సంప‌ద పెంపును వివ‌రిస్తూ.. కేటీఆర్ స్వేద ప‌త్రం పేరుతో గ‌త ప‌దేళ్ల పాల‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌పై క్తుప్తంగా మాట్లాడుతూ.. ఉద్యోగులు, నిరుద్యోగులు దెబ్బేసేశార‌ని వ్యాఖ్యానించారు.