టీడీపీ-జనసేన కూటమికి 135 సీట్లు: పృథ్వీ

రాబోయే ఎన్నికల్లో కొందరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వబోనని ఆ పార్టీ అధినేత జగన్ కరాఖండిగా చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 11 మంది సిట్టింగ్ ల స్థానాలు మార్చిన జగన్ ..త్వరలోనే మరో 70 మందికి స్థాన చలనం కల్పించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంత జరుగుతున్నా..వైసీపీ నేతలు మాత్రం వై నాట్ 175 అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీపై ఆ పార్టీ మాజీ నేత..ప్రస్తుతం జనసేన నేత, కమెడియన్ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజంగా 175కి 175 స్థానాల్లో విజయం లభించే అవకాశం వైసీపీకి ఉంటే దాదాపు 92 చోట్ల అభ్యర్థులను ఎందుకు మార్చుతున్నారని ప్రశ్నించారు. 2024ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, మరికొద్ది నెలల్లో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని అన్నారు. ఈ సారి టీడీపీ-జనసేన కూటమిదే అధికారం అని పృథ్వీ ధీమా వ్యక్తం చేశారు. ఆ కూటమి 135 ఎమ్మెల్యే స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరో 100 రోజుల తర్వాత ఏపీలో సుపరిపాలన ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు.

మంత్రి అంబటి రాంబాబు ఓడిపోతే జబర్దస్త్ షోలు చేసుకోవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. బ్రో సినిమాలో అంబటి రాంబాబు క్యారెక్టర్ ను శ్యాంబాబుగా పేరు మార్చి పెట్టారని నానా రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంబటిపై పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.