పురందేశ్వరి కొడుకు కోసం బాబు త్యాగం

వదిన పురందేశ్వరి తనయుడి గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? ఆయన గెలుపు కోసం బాబు ఓ నియోజకవర్గాన్ని త్యాగం చేయబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి వచ్చే ఎన్నికల్లో తనయుడు హితేష్ చెంచురామ్ ను బరిలో దించాలని చూస్తున్నారని తెలిసింది. కొడుకు రాజకీయ ప్రవేశం కోసం ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వదిన గారి అబ్బాయి కోసం బాబు కూడా మద్దతుగా నిలుస్తున్నారని టాక్.

బాపట్ల జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హితేష్ ను పోటీ చేయించాలని పురందేశ్వరి అనుకుంటున్నారని తెలిసింది. అక్కడ హితేష్ అరంగేట్రం కోసం ఆమె రంగం సిద్ధం చేస్తున్నారని టాక్. కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు వరుసగా రెండు సార్లు గెలిచారు. 2019లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా సాంబశివరావు విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై సాంబశివరావు నెగ్గారు. అంతకుముందు 1985, 1989లో టీడీపీ నుంచి.. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి దగ్గుబాటి వేంకటేశ్వరావు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు కొడుకు హితేష్ ను బరిలో దించేందుకు సిద్ధమయ్యారు.

అయితే తమకు మంచి పట్టు ఉన్న పర్చూరు నియోజకవర్గాన్ని బాబు వదులుకోవడానికి సిద్ధం కావడమే ఇక్కడ గమనార్హం. పురందేశ్వరి కోసమే బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. 2024 ఎన్నికల్లో సాంబశివరావును ఇక్కడి నుంచి తప్పించి, చీరాలకు పంపించే అవకాశముందని టాక్. అంతే కాకుండా టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా హితేష్ ను పర్చూరులో పోటీ చేయించేలా పురందేశ్వరి మంతనాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇలా ఉమ్మడి అభ్యర్థిగా నిలబడితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె నమ్ముతున్నారని టాక్.