శ్వేత‌ప‌త్రం వ‌ర్సెస్ స్వేద ప‌త్రం.. కేటీఆర్ ఆక్రోశం ఇదే!

తెలంగాణ రాజ‌కీయాల్లో శ్వేత ప‌త్రం వ‌ర్సెస్ స్వేద‌ప‌త్రం కాక రేపుతోంది. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అయిన కాడికి అప్పులు చేసి.. మిగులు రాష్ట్రాలు త‌గులు రాష్ట్రంగా మార్చిందంటూ.. ఇటీవ‌ల అసెంబ్లీలో కాంగ్రెస్ స‌ర్కారు శ్వేత ప‌త్రం విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అటు అధికార‌, ఇటు ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో త‌మ స‌ర్కారు ఏం చేసిందో స్వేద ప‌త్రం విడుద‌ల చేస్తామ‌ని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఈ క్ర‌మంలో తాజాగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ స్వేద పత్రం విడుదల చేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోందని మండిపడ్డా రు. శ్వేత పత్రాలు అని హడావుడి చేసి సభను వాయిదా వేసుకుని పారి పోయారని విమర్శించారు.

గతంలో ఏం జరిగిందో చెప్పవలసిన భాధ్యత తమపై ఉందన్న కేటీఆర్ బీఆర్ ఎస్ పాల‌న‌లోనే రాష్ట్రం అభివృద్ధి సాధించింద‌ని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, ఉద్యోగులు చెమటోడ్చి చేసిన కృషి ప్రజలకు తెలియాలన్నారు. విద్వంసం నుంచి వికాసం వైపు జరిగిన ప్రగతి ప్రస్థానం బీఆర్ ఎస్ తోనే సాధ్య‌మైంద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాల‌న‌లో రాష్ట్రం వెనుక‌బ‌డి పోయింద‌ని వివ‌రించారు. త‌ల‌స‌రి ఆదాయం నుంచి విద్యుత్ వినియోగం వ‌ర‌కు.. అన్ని రంగాలూ వెనుక‌బ‌డ్డాయ‌ని తెలిపారు.

కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తెలంగాణ‌ను అగ్ర‌గాఇగా నిల‌బెట్టింద‌ని వివ‌రించారు. కాంగ్రెస్ పాల‌న‌లో కంట త‌డి పెట్ట‌ని ప్ర‌జ‌లు లేర‌ని అన్నారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు కాంగ్రెస్ హ‌యాంలోనే జ‌రిగాయ‌న్నారు. క‌ల్లోల ప‌రిస్థితులు, పోలీసుల కాల్పులు, క‌రువు, కాట‌కాలు.. వారి హ‌యాంపై చెర‌గ‌నిముద్ర వేశాయ‌న్నారు. అయితే.. వాట‌న్నింటినీ తోసిరాజ‌ని కేసీఆర్ బంగారు తెలంగాణ‌ను సాకారం చేశార‌ని కేటీఆర్ వివ‌రించారు.