ఆ నేతల స్పీడ్ కు అర్జెంట్ గా బ్రేక్ వేయాలి జగన్!

చర్యకు ప్రతిచర్య అనివార్యం. అయితే.. అవసరం లేని అంశాల్లో ప్రతిచర్య పేరుతో రియాక్టు అయితే.. దానికి స్పందన ఉంటుందన్న సత్యాన్ని మిస్ కాకూడదు. ఇంత సింఫుల్ లాజిక్ ను ఏపీ అధికారపక్ష నేతల్లో కొందరు ఎందుకు మిస్ అవుతారు? పార్టీకి.. అధినేతకు మైలేజ్ తీసుకురావటమే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరించే కొందరి అత్యుత్సాహం వరుస తప్పులకు కారణం కావటమే కాదు.. ఇమేజ్ తేవటం తర్వాత డ్యామేజ్ చేస్తున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. వ్యూహాన్ని మిస్ కాని అధినేత తీరుకు భిన్నంగా లాజిక్ మిస్ అయి.. నోరు పారేసుకునే ఏపీ అధికారపక్షానికి చెందిన కొందరు నేతలకు పార్టీ అధినేత కమ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యవసరంగా బ్రేకులు వేయాలన్నమాట బలంగా వినిపిస్తోంది.

ఐప్యాక్ క్రియేటర్.. దాన్ని పెంచి పెద్ద చేసిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావటం తెలిసిందే. ఈ అంశంపై తెలుగు తమ్ముళ్లు ఆనందోత్సాహాలకు గురయ్యారు. పీకే తమ అధినేతతో భేటీ అయ్యారంటే.. గెలుపు తమ వాకిట్లోకి వస్తున్న సంకేతాలు బలంగా ఉన్నట్లేనన్నది వారి భావన. అందులో నిజం ఎంత? అన్నది పక్కన పెడితే.. అలాంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లు ఒక పార్టీకి మంచిదే.

ఇదో అంశమైతే.. ఇలాంటి వేళ.. తెలుగు తమ్ముళ్లు ఆనందాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోతే సరిపోతుంది. వారి ఆనందం మీద అర్జెంట్ గా నీళ్లు చల్లాల్సిన అవసరం లేదు. అలా చేయటం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. కానీ.. వైసీపికి చెందిన కొందరు అత్యుత్సాహ నేతలు మాత్రం అర్జెంట్ గా రియాక్టు అయిపోతున్నారు. అలాంటి తీరునే ఇరువురు నేతలు ప్రదర్శించి.. లేని తలనొప్పిని తెచ్చి పెట్టారని చెప్పాలి.

వారిలో ఒకరు మంత్రి అంబటి రాంబాబు. అధినేత జగన్ మీద ఆయనకున్నవీరాభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. అడ్డదిడ్డంగా ఆడేయటం తప్పించి.. ఒక క్రమపద్దతిలో.. టెక్నికల్ గా.. తెలివిగా ఆట ఆడాలన్న విషయాల్ని ఆయన పట్టించుకోరు. లాజిక్ ఆయనకు తట్టదు. సరే.. తొందరపాటు ఎందుకన్న ఆలోచన ఆయనకు రాదు. ఏదైనా జరిగినంతనే.. వెనుకా ముందు చూసుకోకుండా స్పందించే ధోరణి అంబటికి ఎక్కువ. తాజాగా చంద్రబాబును పీకే భేటీ అయిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

ఇలాంటి చర్యకు ప్రతిచర్య లేకపోతే ఏం బాగుంటుందన్న భావనకు గురైన ఆయన క్షణం ఆలోచించకుండా ట్వీట్ పోస్టు చేసేశారు. దాని సారాంశం చూస్తే.. ‘‘మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రీ ఏం చేస్తాడు’’ అంటూ రియాక్టు అయ్యారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూసే తెలుగు తమ్ముడు కం మాజీ మంత్రి కేఎస్ జవహర్ రియాక్టు అయ్యారు. ఆయన కూడా మరో ట్వీట్ చేశారు. అది అంబటి వారికి షాకిచ్చేలా.. పార్టీకి తలనొప్పిగా మారింది. ఇంతకూ మాజీ మంత్రి జవహర్ చేసిన ట్వీట్ చూస్తే.. ‘‘నిజమే. మెటీరియల్ లేదనేగా గంటకు కూడా ఎవరూ రానిది’’ అంటూ పంచ్ వేశారు. మంత్రి అంబటి ట్వీట్ కు మరొకరు స్పందిస్తూ.. ‘‘మెటీరియల్ బాగోలేదనే మేస్త్రీ మరో కాంట్రాక్టుకు వెళ్లిపోయాడు’’ అంటూ వరుస పెట్టి పోస్టులు చేయసాగారు.

అంబటి అత్యుత్సాహం పార్టీకి ఎదురయ్యే ఇబ్బందిని గమనించాల్సింది పోయి.. మరో మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఇంకో ట్వీట్ చేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ‘‘కోడికత్తి.. వివేకానంద రెడ్డి హత్య పీకే ప్లాన్ అన్నారు. ఇప్పుడు ఆ పీకేనే ఇంటికి తెచ్చుకున్నారు’’ అని ట్వీట్ చేశారు. ఆ వెంటనే మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి రియాక్టు అవుతూ.. ‘‘బాబాయి హత్య.. కోడి కత్తి వెనుక వ్యూహం మొత్తం జగన్ దే అని ఒప్పుకొన్నందుకు కోడిగుడ్డు మంత్రికి ధన్యవాదాలు’’ అంటూ కౌంటర్ ఇచ్చిన తీరు చూస్తే అనిపించేది ఒక్కటే.. వారి స్పీడ్ కు బ్రేకులు వేయాల్సిన బాధ్యత జగన్ దే. అన్నింటికి మించి.. లాజిక్ తో స్పందించాలన్న తీరును నేర్పించకుంటే నిండా మునిగిపోవటం ఖాయమన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పటం అన్నింటికి మించిన కష్టసాధ్యమైన పని ఏమో?