చంద్ర‌బాబు యాగాలు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అధికార యాగాలు చేప‌ట్టారు. శుక్ర‌వారం నుంచి వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఉండ‌వ‌ల్లిలోని ఆయ‌న నివాసంలో నిర్విరామంగా య‌జ్ఞాలు, యాగాలు నిర్వ‌హించ‌నున్నారు. నిజానికి ఆల‌యాల‌కు వెళ్ల‌డం, దేవుళ్ల‌ను ద‌ర్శించుకోవ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మైన చంద్ర‌బాబు.. గ‌తంలో ఎప్పుడూ ఎన్నిక‌ల‌కు ముందు ఇలా యాగాలు, య‌జ్ఞాలు చేసిన దాఖ‌లాలు లేవు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు సీఎం కావాల‌ని కోరుతూ.. కొంద‌రు యాగాలు చేశారు.

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా నాయ‌కుడు బీటెక్ ర‌వి, విజ‌య‌వాడ‌లో వంగ‌వీటి రంగా వార‌సుడు రాధా అప్ప‌ట్లో యజ్ఞాలు చేశారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావాల‌ని బ‌లంగా కోరుకుని.. వారు వాటిని అప్ప‌ట్లో నిర్వ‌హించారు. రాధా నిర్వ‌హించిన యాగానికి ఆయ‌న మాతృమూర్తి కూడా హాజ‌ర‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్రబాబు నేరుగా ఆయా యాగాల్లో పాల్గొన‌లేదు. అంతేకాదు.. ఆయ‌న రాజ‌కీయాల‌ను ఉద్దేశించి.. త‌న అధికారాన్ని ఉద్దేశించి ఎప్పుడూ ఇలాంటి క్ర‌తువులు చేసింది కూడా లేదు.

కానీ, తాజాగా చంద్ర‌బాబు యాగాలు త‌ల‌పెట్టారు. పూర్తిగా త‌న ఖ‌ర్చుతోనే శ్రీశైలం, యాదాద్రి దేవాల‌యాల నుంచి ప్ర‌త్యేకంగా రుత్విక్కుల‌ను తీసుకువ‌చ్చి.. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా ఈ యాగాలు చేయ‌నున్నారు. వీటిలో శ‌త‌చండీ పారాయ‌ణ‌, ఏకోత్త‌ర వృద్ధి, మ‌హా చండీ యాగం, సుద‌ర్శ‌న నార‌సింహ హోమం నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో నారా భువ‌నేశ్వ‌రి తో పాటు.. నంద‌మూరి కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీని ఒక‌వైపు లైన్‌లో పెడుతూనే.. మ‌రోవైపు.. దైవ శ‌క్తిని కూడా తోడు కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆయ‌న యాగాలు, య‌జ్ఞాల బాట ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. గ‌తానికి భిన్నంగా జ‌రుగుతున్న ఈ యాగాల అనంత‌రం నుంచి.. చంద్ర‌బాబు జిల్లాల బాట ప‌ట్ట‌నున్నారు. అనంత‌రం.. పూర్తిస్థాయిలో ఆయ‌న ఎన్నిక‌ల‌కు సిద్ధం కానున్నారు.