అసెంబ్లీలో అక్బరుద్దీన్ వర్సెస్ రేవంత్

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ముగిశాయి. శాసన సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 9న ప్రారంభమైన సమావేశాలు 6 రోజుల పాటు సాగి డిసెంబరు 21న ముగిశాయి. మొత్తం 26 గంటల 33 నిమిషాల పాటు సభ జరిగింది.

సభ చివరి రోజున సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నరీతిలో మాటల యుద్ధం జరిగింది. గత ఎన్నికల్లో కేసీఆర్, మజ్లిస్ కలిసి పని చేశాయని, నిజామాబాద్‌ అర్బన్‌లో షబ్బీర్ అలీని, జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌ను ఓడించేందుకు కేసీఆర్‌తో కలిసి మజ్లిస్ పని చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లలో మజ్లిస్ ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.

మైనార్టీ నేతలను ముఖ్యమంత్రులను, రాష్ట్రపతులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. కేసీఆర్‌కు అక్బరుద్దీన్ మిత్రుడు కావొచ్చని, మోదీకి మద్దతివ్వవ్వొచ్చని, అది ఆయన ఇష్టం అని చెప్పారు. కానీ, తమకు పాత బస్తీ, కొత్త బస్తీ తేడాలు లేవని, పాతబస్తీని అభివృద్ధి చేస్తామని అన్నారు.

6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అక్బరుద్దీన్ ఎంతసేపు మాట్లాడినా ఇబ్బంది లేదని, ఆయనకు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం ఇచ్చామని రేవంత్ చెప్పారు. కానీ, కేసీఆర్‌ను కాపాడేందుకు మజ్లిస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ముస్లింలందరికీ అక్బరుద్దీన్ నాయకుడు కాదని, మజ్లిస్ పార్టీకి మాత్రమే నాయకుడని చురకలంటించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా మజ్లిస్ సభ్యులు వెల్‌లోకి దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే రేవంత్ వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ మండిపడ్డారు. తాము ఎవరికీ భయపడబోమని, కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదని చెప్పారు. కాంగ్రెస్ తమను అణచివేసే ప్రయత్నం చేస్తోందని, పాతబస్తీలో విద్యుత్ చౌర్యం అంటున్నారో, విద్యుత్ బకాయిలు అంటున్నారో చెప్పాలని నిలదీశారు. ఎక్కడ పోటీ చేయాలి, చేయకూడదు అన్నది మజ్లిస్ ఇష్టమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి చెందిందని, రూ.25 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.