విశాఖకు రాజధాని తరలింపునకు హైకోర్టు బ్రేక్

త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు ఏపీ సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకారమే సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలుతోందని అధికారులు హడావిడి చేస్తున్నారు. జగన్ కూడా త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగిస్తానని పలుమార్లు హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ స్పీడ్ కు హైకోర్టు బ్రేకులు వేసింది. విశాఖకు కార్యాలయాల తరలింపు కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ హైకోర్టు తాజాగా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చే వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై జారీ అయిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. అయితే, అమరావతిలో కార్యాలయాల కన్నా భారీ స్థాయిలో విశాఖలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని, కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకువెళ్లారు. అందుకే, ఈ తరలింపుపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు.

గతంలో ఆర్ 5 జోన్ భూముల విషయంలో కూడా సీఎం కార్యక్రమం పేరుతో ఒక రోజుకు 3 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ అప్పటివరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది. కాగా, సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన వెంటనే అమరావతి రాజధానిపై శీతకన్ను వేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు రాజధానులు అంటూ విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా జగన్ ప్రకటించారు. విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు జగన్ సర్కార్ అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టింది. అయితే, నిర్మాణాలలో జాప్యం కారణంగా విశాఖకు రాజధాని తరలింపులో జాప్యం జరుగుతూ వస్తోంది.