దేశంలో ‘చ‌ట్టం’ మారింది.. ఇక‌నైనా!

140 కోట్ల మందికిపైగా ప్ర‌జలు ఉన్న భార‌త దేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం జ‌రిగింది. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న చ‌ట్టాలు ఇక నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. మొత్తంగా మూడు కీల‌క చ‌ట్టాల‌ను మార‌స్తూ.. మోడీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. దీనికి పార్ల‌మెంటు కూడా తాజాగా ఆమోదం తెలిపింది. ఉన్న చ‌ట్టాల్లో కీల‌క మార్పులు చేర్పులు చేస్తూ.. మ‌రింత ప‌దును పెట్ట‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో భార‌తీయ‌త‌ను ఈ చ‌ట్టాల‌కు జోడించారు. అయితే.. చ‌ట్టాలు మారాయి. మ‌రి ఇక‌నైనా వేగ‌వంత‌మైన‌, పార‌ద‌ర్శ‌క‌మైన న్యాయం దక్కుతుందా? అనేది చూడాలి.

ఏం చేశారు..
దాదాపు 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), సాక్ష్యాధార చట్టం (ఎవిడెన్స్‌ యాక్ట్‌) స్థానంలో మోడీ స‌ర్కారు కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఈ మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనంతరం మూజువాణి ఓటింగ్‌ చేపట్టి ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించింది.

ఇవీ మూడు చ‌ట్టాలు

1) భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)

2) భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)

3) భారతీయ సాక్ష్య (బీఎస్‌)

ఏం జ‌రిగింది?
ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తొలిసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే, వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో తాజా శీతాకాల సమావేశాల్లో వీటిని కేంద్రం వెనక్కు తీసుకుంది. ఆ తర్వాత వీటిలో మార్పులు చేసి.. ‘భారతీయ న్యాయ (రెండో) సంహిత’, ‘భారతీయ నాగరిక్‌ సురక్షా (రెండో) సంహిత’, ‘భారతీయ సాక్ష్య (రెండో)’ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులను దిగువ సభ ఆమోదించడంతో వాటిని రాజ్యసభకు పంపనున్నారు. దాదాపు ఈ ఏడాది చివ‌రి నాటికే ఇవి అమల్లోకి రానున్నాయి.