ఓడినవారికి నో ఛాన్స్

మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఎట్టి పరిస్ధితుల్లోను మళ్ళీ పదవుల్లో నియమించకూడదని తెలంగాణా పీసీసీతో పాటు ఐఏసీసీ కూడా నిర్ణయించినట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో వివిధ కారణాలతో కొందరు సీనియర్లకు పార్టీ టికెట్లు ఇవ్వలేదు. అప్పట్లో టికెట్లు ఇవ్వలేకపోతున్నా కారణంగా అనేక హామీలిచ్చింది. అలాంటి హామీల్లో ఎంఎల్సీ పదవులు, పార్లమెంటు టికెట్లు, కార్పొరేషన్ పదవుల్లాంటివి ఉన్నాయి. కాబట్టి ముందుగా పోటీచేయని సీనియర్లకు, పార్టీ గెలుపుకోసం కష్టపడిన వారికి టాప్ ప్రయారిటి ఇవ్వాలన్న పీసీసీ ప్రతిపాదననే ఐఏసీసీ అగ్రనేతలు కూడా సమర్ధించారట.

మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయిన వారిలో జగ్గారెడ్డి, షబ్బీర్ ఆలీ, మధు యాష్కి గౌడ్, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళున్నారు. అయితే జీవన్ ఇప్పటికే ఎంఎల్సీ కాబట్టి ఓడినా నష్టం జరగలేదు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ అధికారంలోకి రావటంతో ఓడిపోయిన వాళ్ళందరిలో ఆశలు మొదలయ్యాయి. తొందరలోనే భర్తీ చేయబోతున్న ఎంఎల్సీ పదవులు, కార్పొరేషన్ పదువుల్లో తమను నియమించాలని రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు.

ఇక్కడే పార్టీలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఎన్నికల్లో టికెట్లు వాళ్ళకే కావాలి, ఓడిపోతే తర్వాత భర్తీచేయబోయే నామినేటెడ్ పోస్టులూ వాళ్ళకే కావాలా అంటు కొందరు సీనియర్లపై మిగిలిన నేతలు గుర్రుమంటున్నారు. తొందరలోనే ఆరు ఎంఎల్సీ పదవులను భర్తీ చేయాల్సుంటుంది. ఇందులో గవర్నర్ కోటాలో రెండు, ఎంఎల్ఏల కోటాలో రెండు, లోకల్ బాడీ, గ్రాడ్యుయేట్ల కోటాలో చెరో స్ధానం భర్తీ అవుతాయి. ఈ ఆరింటినీ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఉండటంతో మొన్నటి ఎన్నికల్లో ఓడిన వారు, సీనియర్లు పోటీలు పడుతున్నారు.

పీసీసీ. ఏఐసీసీ తాజా నిర్ణయంతో చాలామంది సీనియర్లకు మండిపోవటం ఖాయం. కాకపోతే పార్టీ భవిష్యత్తును, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని పార్టీ భావిస్తోంది. అందుకనే పదవుల భర్తీలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏదేమైనా పదవుల భర్తీ అన్నది రాబోయే పార్లమెంటు ఎన్నికల తర్వాతే ఉండబోతోందని పార్టీవర్గాల సమాచారం. లేకపోతే అప్పటికి కంపు అయిపోవటం ఖాయం.