జగన్ ను దెబ్బ కొట్టాలని చాలా కసిగా వున్నాడు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గేమ్ మొదలెట్టారు. తనను కాదన్న వైసీపీని ఓడించేందుకు.. తనను అక్కున చేర్చుకున్న టీడీపీని గెలిపించేందుకు శ్రీధర్ రెడ్డి కదన రంగంలోకి దిగారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. అధికార వైసీపీని వీడినప్పటికీ నియోజకవర్గంలో తన పట్టు నిలబెట్టుకునేందుకు కసరత్తులు మొదలెట్టారు. మొత్తం కుటుంబంతో కలిసి నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ ను గట్టి దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో తన నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

2014లో వైసీపీ పార్టీ తరపున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లోనూ విజయ ఢంకా మోగించారు. కానీ ఆ తర్వాత వైసీపీలో ఉండలేకపోయారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిసి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే కారణంతో శ్రీధర్ రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయినా తగ్గేదేలే అన్నట్లు శ్రీధర్ రెడ్డి దూసుకెళ్తున్నారు. టీడీపీకి చేరువైన ఆయన.. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచి తీరాలనే పట్టుదల ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఇంకా అధికారికంగా టీడీపీలో చేరకపోయినప్పటికీ చంద్రబాబు కూడా శ్రీధర్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జీగా శ్రీధర్ రెడ్డిని బాబు నియమించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి, తన చేతిలో ఓడిన అబ్దుల్ అజీజ్ స్థానంలోకి శ్రీధర్ రెడ్డి వచ్చారు. అయితే పార్టీలో ఎలాంటి విభేధాలు లేకుండా, శ్రీధర్ రెడ్డితో కలిసి పనిచేయాలని అజీజ్ ను బాబు ఒప్పించారు. దీంతో నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ క్యాడర్ను కలిపేసుకుంటూ సాగుతున్నారు. భార్య సుజిత, కుమార్తెలు లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవిని కూడా శ్రీధర్ రెడ్డి రంగంలోకి దించారు. వీళ్లంతా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీకి మద్దతునివ్వాలంటూ, శ్రీధర్ రెడ్డిని మళ్లీ గెలిపించాలంటూ కోరుతున్నారు.