నాపై నాకే అస‌హ్య‌మేస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే

“నాపై నాకే అస‌హ్యమేస్తోంది. ఇది నిజం. పైకి అసంతృప్తి అని చెబుతున్నానే కానీ.. మ‌న‌సులో మాత్రం చాలా అస‌హ్యంగా ఉంది. నాలుగున్న‌రేళ్ల‌లో ఒక్క ప‌నిని కూడా చేయ‌లేక‌పోయాను. ఇప్పుడు చేస్తాన‌న్న న‌మ్మ‌కం కూడా నాకులేదు. టికెట్ ఇస్తారా? ఇవ్వ‌రా? అనేది ప‌క్క‌న పెట్టండి. నేను మాత్రం ఇక్క‌డ నుంచే పోటీ చేస్తా. ఈ విష‌యంలో ఢోకాలేదు. నేను.. నా దేహం ఈ మ‌ట్టిలోనే క‌లిసిపోతుంది. ఇది ప‌క్కా!” అని వైసీపీ ఎమ్మెల్యే, ఉమ్మ‌డి అనంత‌పురం రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం స‌భ్యుడు తోపుదుర్తి ప్ర‌కాష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రాప్తాడు అసెంబ్లీ స్థానంలో మార్పులు త‌థ్య‌మ‌ని వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో తాజాగా తోపుదుర్తి.. త‌న అనుచ‌రుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం స్థితిగ‌తుల‌పైనా.. స్థానిక ప్ర‌జలు ఏమ‌నుకుంటున్నార‌నే విష‌యంపైనా వారితో చ‌ర్చించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పైవిధంగా వ్యాఖ్యానించారు. “న‌న్ను చాలా ఆశ‌ల‌తో మీరంతా గెలిపించారు. మీరు రండి.. నా ఇంట్లో తినండి.. అంత‌కు మించి ఏమీ కోర‌కండి! నేను ఏమీ చేయ‌లేక‌పోయాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. ఈ విష‌యం త‌ల‌చుకుంటే సిగ్గేస్తోంది. అస‌హ్యం కూడా వేస్తోంది. ఏం చేయ‌ను” అని తోపుదుర్తి వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం వైసీపీలో ఇంచార్జ్‌ల మార్పు నేప‌త్యంలో రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలోనూ మార్పులు త‌ప్ప‌వ‌నే సంకేతాలు గ‌త రెండు రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పైనా తోపుదుర్తి చ‌ర్చించారు. 2004, 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస ఓట‌ములు ఎదుర్కొన్న తోపుదుర్తి.. 2019 ఎన్నిక‌ల్లో ప‌రిటాల శ్రీరాంపై విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న‌పై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా భూముల కుంభ‌కోణం.. హైద‌రాబాద్‌లో భారీ విల్లాల క‌ట్ట‌డాలు.. వంటివి ప్ర‌ధానంగా కొన్నాళ్ల కింద‌ట చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే పార్టీ ఆయ‌న‌ను ప‌క్కన పెట్టేందుకురెడీ అయింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.