కాళేశ్వరంపై సెంట్రల్ కమిటీ తో విచారణ ?

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేసేందుకు కేంద్ర విచారణ కమిటిని రాష్ట్రప్రభుత్వం ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. కేంద్ర జలవనరుల శాఖలో డ్యామ్ సేఫ్టీ వింగ్ లో నిపుణులు చాలామందున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినపుడు, బ్యారేజ్ నిర్మాణం కొంతమేర దెబ్బతిన్నపుడు తనిఖీ చేసేందుకు కేంద్ర జలశక్తి నుండి నిపుణలు వచ్చారు. నాలుగురోజులు ఇక్కడే ఉండి చాలా అంశాలను పరిశీలించారు. అయితే అప్పట్లో వీరికి కేసీయార్ ప్రభుత్వం నుండి సరైన సహకారం అందలేదు.

కేంద్రం నిపుణులు బృందం అడిగిన సందేహాల్లో చాలావాటికి రాష్ట్రప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేదు. అవసరమైన సమాచారాన్ని కూడా ఇవ్వకుండా కేంద్ర బృందాన్ని ఇబ్బంది పెట్టింది. ఈ విషయాలన్నీ నిపుణుల బృందం కేంద్ర జలశక్తికి ఇచ్చిన నివేదికలోనే చెప్పింది. అందుబాటులోని సమాచారం ప్రకారమే రిపోర్టును తయారుచేసి జలశక్తికి ఇచ్చేసింది. అందులోనే నిర్మాణంలో లోపాలు, డిజైన్లలో లోపాలున్నట్లు స్పష్టంగా చెప్పిందట. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరంపై సమీక్ష జరిపింది.

పనిలోపనిగా కాళేశ్వరం లోపాలతో పాటు మేడిగడ్డ లోపాలపై విచారణ చేసేందుకు కేంద్ర జలశక్తి నిపుణుల బృందాన్ని పిలిపించాలని డిసైడ్ అయ్యిందని సమాచారం. ఇదే విషయమై తొందరలోనే కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం నుండి లేఖ వెళ్ళబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కేంద్ర నిపుణుల బృందం కూడా రెండోసారి రాష్ట్రానికి వచ్చి పై రెండుప్రాజెక్టుల నిర్మాణాలపై పూర్తిస్ధాయిలో అధ్యయనం చేయటానికి రెడీగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అంటే అధ్యయనం, విచారణ ఏదైనా కావచ్చు రావాలంటే నిపుణుల బృందాన్ని పంపాలని కేంద్రానికి లేఖ రాయటమే ఆలస్యమన్నమాట.

ఇక్కడే రెండు ప్రాజెక్టుల సమీక్షలంటేనే ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్ సంస్ధలతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారుల్లో వణుకు మొదలవుతోందట. కేంద్ర దర్యాప్తు బృందం చేయబోయే పరిశీలనలో ఎలాంటి లోపాలు బయటపడతాయో అనే టెన్షన్ పెరిగిపోతోందని సమాచారం. ఇరిగేషన్, విద్యుత్, సివిల్ సప్లైస్ లాంటి శాఖలపై పదేపదే సమీక్షలు చేయటంలో ఉద్దేశ్యం ఏమిటంటే పదేళ్ళలో జరిగిన అక్రమాలు, అవినీతిని బయటకు తీయటమే. ఎందుకంటే పదేళ్ళల్లో కేసీయార్ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిని ఆధారాలతో సహా పార్లమెంటుఎన్నికల సమయానికి జనాలముందుంచటమే అసలు ఉద్దేశ్యం.