కిషనే కంటిన్యూ అవుతారా ?

వీలైనంత తొందరలో తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మార్చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి తెరపడబోతున్నట్లు సమాచారం. కిషన్ను మరికొంతకాలం అధ్యక్షుడిగా కంటిన్యు చేయటానికే అగ్రనేతలు మొగ్గుచూపుతున్నారట. కారణం ఏమిటంటే తొందరలోనే పార్లమెంటు ఎన్నికలుండటమే. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ పెర్ఫార్మెన్స్ ఏమంతా బ్రహ్మాండంగా లేదనే చెప్పాలి. ఎలాగంటే తన సొంత నియోజకవర్గం అంబర్ పేటలో కూడా బీజేపీ అభ్యర్ధి క్రిష్ణయాదవ్ ఓడిపోయారు.

అయితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను రాబట్టిందనే చెప్పాలి. ఎలాగంటే ఎన్నికలకు ముందు బీజేపీకి ఉన్నది కేవలం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే. ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లలో గెలిచింది. అంటే మూడు అసెంబ్లీ సీట్ల నుండి పార్టీ బలం 8 ఎంఎల్ఏలకు పెరిగింది. అసలైతే అధికారంలోకి వచ్చేయటం ఖాయమని కమలనాదులు పదేపదే చెప్పుకున్నారు. బీజేపీ అధికారంలోకి రాదని చెప్పుకున్నవాళ్ళతో సహా అందరికీ తెలుసు. అయినా పోటీచేసే ప్రతిపార్టీ అధికారంలోకి వస్తుందనే చెబుతుంది కానీ రాదని చెప్పుకోదు కదాని జనాలు సరిపెట్టుకున్నారు.

బీజేపీ 8 సీట్లలో గెలవటమే కాకుండా మరో 19 నియోజకవర్గాల్లో రెండోప్లేసులో నిలిచింది. దీనికి కారణం ఏమిటంటే ప్రధానంగా బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా జరిగిన పోరాటం మధ్యలో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. ఎలా గెలిచినా గెలవటమే ముఖ్యం కాబట్టి 8 సీట్లలో గెలుపు బీజేపీకి చాలా కీలకమైంది. ఈ నేపధ్యంలోనే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా మార్చి మరొకళ్ళని కొత్తగా నియమించటం వల్ల ఉపయోగంలేదని ఢిల్లీ నాయకత్వం భావించిందట.

కొత్తగా బాధ్యతలు తీసుకున్న నేత కుదురుకోవటానికే కనీసం రెండు నెలలు పడుతుంది. అంటే అప్పటినుండి పార్లమెంటు ఎన్నికలకు పెద్దగా సమయం కూడా ఉండదు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు ఏప్రిల్-మేలో జరగాల్సుంటుంది. అయితే మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బాగా ప్రచారం అవుతోంది. కాబట్టి డిసెంబర్లో కొత్త అధ్యక్షుడిని నియమించి మార్చిలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని గెలిపించమని చెప్పటం వల్ల ఎలాంటి ఉపయోగముండదని అనుకున్నారట. పైగా రాబోయే ఎన్నికల్లో పది ఎంపీ సీట్లలో గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. మరి ఏమవుతుందో చూడాలి.