బస్సు దెబ్బ మెట్రో మీద పడిందా ?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం ప్రభావం మెట్రో ట్రైన్ మీద బాగానే పడినట్లుంది. రోజువారి ప్రయాణించే వారి సంఖ్య బాగానే తగ్గిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నివేల బస్సులున్నా రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ఎన్ని బస్సులున్నా ప్రయాణీకులకు సరిపోవటంలేదు. అందుకనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బాగా ఆలోచించి మెట్రో రైలు ప్రాజెక్టును ఓకే చేశారు.

అయితే ప్రాజెక్టుకు డీపీఆర్ తయారై తొందరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభం అవబోతున్నది అనుకునే సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తర్వాత కాల ప్రభావం వల్ల కేసీయార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు ప్రారంభమై ప్రాజెక్టు పట్టాలకెక్కింది. ఎప్పుడైతే మెట్రో ప్రాజెక్టు మొదలైందో అప్పటినుండి బస్సుల మీద కాస్త ఒత్తిడి తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే మెట్రోలో ప్రతిరోజు సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రశాంతంగా ప్రయాణించటమే కాకుండా బస్సులో కన్నా చాలా స్పీడుగా గమ్యస్ధానాలకు చేరుకోవటం వల్లే మెట్రోకు ఆదరణ పెరిగింది.

అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఎప్పుడైతే మహిళలకు బస్సు ప్రయాణం ఉచితమని ప్రభుత్వం ప్రకటించిందో వెంటనే ఆడవాళ్ళు మెట్రో ప్రయాణం నుండి బస్సులవైపు మళ్ళారు. ఇంతకుముందు ప్రతిరోజు బస్సుల్లో సుమారు 10 లక్షలమంది ప్రయాణించేవారట. అలాంటిది ఇపుడు మహాలక్ష్మీ పథకం పుణ్యమాని బస్సులు ఎక్కేవాళ్ళ సంఖ్య ఒక్కసారిగా 5 లక్షలకు పెరిగి ప్రయాణీకుల సంఖ్య 15 లక్షలకు చేరుకుందట.

ఐదు రోజుల క్రితంవరకు మెట్రోలో రోజుకు సగటున 5 లక్షలమంది ప్రయాణం చేసేవారట. అలాంటిది గడచిన నాలుగు రోజులుగా 50 వేలమంది ప్రయాణీకులు తగ్గిపోయినట్లు లెక్కలు కట్టారు. మెట్రో, బస్సులే కాకుండ ఆటోల్లో కూడా రోజు కొన్ని లక్షలమంది ప్రయాణం చేసేవారు. అలాంటిది ఇపుడు ఉచిత బస్సుల్లో ప్రయాణం చేసేందుకే మహిళలు మొగ్గుచూపుతున్నారట. దాంతో మెట్రోతో పాటు ఆటోలో ప్రయాణాలు కూడా బాగా తగ్గిపోయాయని సమాచారం. ఏదేమైనా ఉచిత ప్రయాణం దెబ్బ మెట్రోపై బాగానే పడింది. మరో వారంపోతే కానీ మెట్రో పరిస్ధితి ఏమిటో స్పష్టంగా తెలీదు.