రేవంత్ ప్రభుత్వం పనికి జనాలు ఫిదా

కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి జనాలు ఫిదా అవుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో సిక్స్ గ్యారెంటీస్ హామీలు చాలా కీలకపాత్ర పోషించాయనే చెప్పాలి. ఆ సిక్స్ గ్యారెంటీస్ లో రెండింటిని ప్రభుత్వం 9వ తేదీన అంటే శనివారం ప్రారంభించింది. అవిరెండు ఏమిటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ సేవలను రు 5 లక్షల నుండి రు. 10 లక్షలకు పెంచటం.

ఈ రెండు సేవలను ప్రభుత్వం ఏకకాలంలో రాష్ట్రమంతా ప్రారంభించింది. హైదరాబాద్ లో రేవంత్ ప్రారంభిస్తే జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు ప్రారంభించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నియోజకవర్గం ఎంఎల్ఏల చేతనే రెండు సర్వీసులను ప్రభుత్వం ప్రారంభింపచేయటం. ఇందులో భాగంగానే నగరంలోని సనత్ నగర్ ఎంఎల్ఏ తలసాని శ్రీనివాసయాదవ్ ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సర్వీసుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను కూడా ప్రారంభించారు.

మామూలుగా అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిపక్ష ఎంఎల్ఏలు హాజరుకారు. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రోటోకాల్ పాటించటం మానేసి చాలాకాలం అయిపోయింది. ప్రభుత్వ కార్యక్రమాలను అధికారపార్టీ కార్యక్రమాలుగా మార్చేశారు. దాంతో ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎంఎల్ఏలను పిలవటం లేదు, ఒకవేళ పిలిచినా ప్రతిపక్షాల ఎంఎల్ఏలు హాజరుకారు. ఎందుకంటే ప్రోటోకాల్ పాటించకుండా అధికారపార్టీ నేతలు అవమానిస్తారని. ఈ పరిస్ధితి కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ళల్లో పీక్స్ కు చేరుకుంది. ప్రతిపక్షాలను, ప్రతిపక్ష ఎంఎల్ఏలను కేసీయార్ అసలు లెక్కచేసిందే లేదు.

అయితే రేవంత్ అధికారంలోకి రాగానే పార్టీలతో పనిలేకుండా ప్రోటోకాల్ ప్రకారం ఎంఎల్ఏలతోనే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభింపచేయాలని ఆదేశాలిచ్చారు. దాంతో అధికారులు ఎంఎల్ఏలతోనే ప్రభుత్వ సేవలు, కార్యక్రమాలను ప్రారంభింపచేస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు సర్వీసులను తలసాని శ్రీనివాసయాదవ్ ప్రారంభించారు. నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమనే చెప్పాలి. అధికారంలో ఏ పార్టీ ఉన్నదన్నది కాకుండా ప్రోటోకాల్ పాటించేలా అధికారులను ఆదేశించటం సంతోషించాల్సిన విషయమే. మరీ ప్రోటోకాల్ ఎంతకాలం అమలవుతుందో చూడాలి.