ఆ విషయంపై మోడీకి చంద్రబాబు లేఖ

మిగ్జామ్ తుపాను ధాటికి నష్టపోయిన రైతులను సీఎం జగన్ పరామర్శించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పొలం గట్టు దగ్గర టెంటు వేసుకొని..అక్కడ బారికేడ్లు పెట్టి…దానికి అవతల రైతులను నిలబెట్టి జగన్ మాట్లాడడంపై ట్రోలింగ్ జరుగుతోంది. ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికి అందకుండా పోయిందని పుట్టెడు దు:ఖంలో ఉన్న రైతన్నకు ఆపన్న హస్తం అందించాల్సిన జగన్..కనీసం ఆ తడిచిన వరి మొక్కలను పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం నిజంగా శోచనీయం.

మరోపక్క, ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు మాత్రం…74 ఏళ్ల వయసులో ఇటీవల క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించున్న విషయాన్ని కూడా పక్కనబెట్టి వరి చేలోకి దిగి స్వయంగా వరి పైరును పరిశీలించారు. అంతేకాదు, నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆయన లేఖ రాశారు. 22 లక్షల ఎకరాల్లో పంటలను తుపాన్ నాశనం చేసిందని, ప్రాణ ఆస్తి నష్టం సంభవించిందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మిగ్జామ్ ను జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు.

తుపాను కారణంగా 15 జిల్లాలు ప్రభావితమయ్యాయని, రూ. 10 వేల కోట్ల వరకు పంట నష్టం ఉంటుందని అంచనా అని తెలిపారు. దాదాపు 770 కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఆక్వా రంగం కూడా నష్టపోయిందని,నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మత్స్యకార పడవలు, వలలకు కూడా నష్టం వాటిల్లి జీవనోపాధి కోల్పోయారని తెలిపారు. పంట నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కోరారు.

మరోవైపు, అనంతపురం జిల్లాలో నక్కదొడ్డి తండాకు చెందిన సరోజమ్మ (40) అనే అంధురాలు పింఛను తొలగించారన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. ఆమె తమ్ముడికి రైల్వే ఉద్యోగం వచ్చినందున ప్రభుత్వం ఆమె పింఛను నిలిపివేసిందని తెలుస్తోంది. దీంతో, ఆ వ్యవహారంపై చంద్రబాబు స్పందించారు. “కొంచెం మానవత్వం చూపండి జగన్ గారూ… మాటల్లో కాదు చేతల్లో” అంటూ విజ్ఞప్తి చేశారు. ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగించడం కర్కశత్వం అని, ఆమె ఆత్మహత్య అత్యంత హృదయ విదారకరం అని పేర్కొన్నారు.