మంత్రివర్గాన్ని బాగానే మ్యానేజ్ చేశారా ?

కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపుల గోల ఎక్కువగా ఉండే పార్టీ. ఈ విషయం రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నవారు కూడా అంగీకరిస్తారు. అలాంటి పార్టీ తరపున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ కు పోటీగా మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీపడినా ఉపయోగం లేకపోయింది. తమను కాదని రేవంత్ వైపు అధిష్టానం మొగ్గుచూపటంతో ముందు వీళ్ళిద్దరు అలిగినా తర్వాత బుజ్జగింపులతో మెత్తబడ్డారు.

అందుకనే భట్టీ డిప్యుటి సీఎంగా, ఉత్తమ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇది మినహా వేరే గొడవలు ఏమీ జరగలేదు పార్టీలో. ఇపుడు మంత్రిపదవులు అందుకున్న వాళ్ళ విషయంలో కూడా ఎవరు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తంచేయలేదు. మంత్రిపదవులు అందుకున్న వాళ్ళు కూడా తమకు కేటాయించిన శాఖల విషయంలో నెగిటివ్ గా స్పందించలేదు. మామూలుగా అయితే ఈపాటికి మీడియాలో నానా గోల జరిగిపోవాల్సింది. ఇద్దరు ముగ్గురు మంత్రులు అసంతృప్తిగా ఉన్నా దాన్ని మీడియా మొత్తం మంత్రివర్గానికి చుట్టేయటం మామూలే.

వెంటనే ఆ తలనొప్పి ముఖ్యమంత్రికి చుట్టుకుంటుంది. అయితే ఇపుడు అలాంటి గొడవలేమీ లేవనే అనుకోవాలి. ఎందుకంటే మంత్రివర్గంలోకి వచ్చిన వాళ్ళు, తమకు కేటాయించిన శాఖల విషయంలో కూడా హ్యాపీగానే ఉన్నట్లు చెప్పారు. దీనికి ప్రధాన కారణం పదేళ్ళ తర్వాత అధికారంలోకి రావటంకూడా కావచ్చు. పైగా ఏమాత్రం ఏమారినా ప్రభుత్వాన్ని కూలదోయటానికి బీఆర్ఎస్ రెడీగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోగా కూలిపోతుందని కడియం శ్రీహరి, మాజీ ఎంఎల్ఏ షకీల్ లాంటి వాళ్ళు వార్నింగులిస్తున్నారు.

కాబట్టి మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూలదోసుకున్నట్లు అయిపోతుందనే భయం కూడా తెలంగాణా కాంగ్రెస్ నేతలకు ఉండచ్చు. ఏదేమైనా మంత్రివర్గం కూర్పు, శాఖల కేటాయింపులో ఏఐసీసీ కీలక నేతలు బాగానే కసరత్తు చేసినట్లున్నారు. అందుకనే ఎక్కడా సమస్యలు ఎదురుకాకుండా ప్రమాణస్వీకారోత్సవం గ్రాండ్ గా జరిగిపోయింది. ఇక రేవంత్ తో పాటు మంత్రులు ఇచ్చిన హామీల అమలుపైన దృష్టి కేటాయిస్తే బాగుంటుంది.